రాహుల్ త్రిపాఠి ఏం పాపం చేశాడంటూ బీసీసీఐ టీ20జట్టు సెలక్షన్ పట్ల నెటిజన్ల మండిపాటు

ఐపీఎల్ 2022 మే 29న ముగిసిన తర్వాత.. జూన్ 9నుంచి దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగబోయే అయిదు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడబోయే జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఊహించినట్టే సన్రైజర్స్ హైదరాబాద్ స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మలిక్కు ఈ జట్టులో చోటు దక్కింది. అతనితో పాటు పంజాబ్ కింగ్స్ డెత్ బౌలింగ్ స్పెషలిస్టు అర్ష్దీప్ సింగ్ సైతం టీ20జట్టుకు ఎంపికయ్యాడు. ఇకపోతే లక్నో బౌలర్ అవేష్ ఖాన్, ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్, లక్నో స్పిన్నర్ రవి బిష్ణోయ్లకు కూడా తుది జట్టులో స్థానం దక్కింది. మొత్తం 18 మందితో కూడిన ఈ జట్టును తన అధికారిక వెబ్సైట్లో బీసీసీఐ పేర్కొంది. ఇక ఐపీఎల్లో రాణిస్తున్న వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్కు చోటు దక్కగా.. బ్యాటింగ్లో రాణిస్తున్న సన్ రైజర్స్ ప్లేయర్ రాహుల్ త్రిపాఠికి మాత్రం బీసీసీఐ మొండిచేయి చూపించింది. ఐపీఎల్లో అనూహ్యంగా రాణిస్తున్న రాహుల్ త్రిపాఠి భారత టీ20 జట్టులో తప్పకుండా స్థానం సాధిస్తాడని అభిమానులు, క్రికెట్ ప్రముఖులు సైతం ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే సెలెక్టర్లు మాత్రం అతనికి మొండిచేయి చూపించారు. దీంతో ట్విట్టర్లో బీసీసీఐకి నెటిజన్లు ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
త్రిపాఠి ఇప్పటివరకు ఐపీఎల్ 2022లో అద్భుతంగా రాణించాడు
రాహుల్ త్రిపాఠి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ లైనప్లో కీలక ఆటగాడిగా మారాడు. ఈ ఐపీఎల్ 2022లో అత్యంత స్థిరమైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా రాణించాడు. అతను 13 మ్యాచ్లలో 39.30సగటుతో 393పరుగులు చేశాడు. అలాగే 161.73స్ట్రైక్ రేట్తో తన బ్యాటింగ్ పదును చూపించాడు. అతని పరుగులలో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ సీజన్లోనే కాదు.. త్రిపాఠి ఐపీఎల్తో పాటు దేశవాళీ క్రికెట్లో కూడా నిలకడగా రాణిస్తున్నాడు.
కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టీ20 జట్టు
దక్షిణాఫ్రికాతో ఆడబోయే టీ20జట్టుకు కేఎల్ రాహుల్ సారథ్యాన్ని వహించనున్నాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఇక టీం ప్రకారం చూసుకుంటే.. కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్-వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రన్ మలిక్లు ఉన్నారు.
సంజూశాంసన్, త్రిపాఠిలకు ఏం తక్కువైందని
ఇక పోతే కెప్టెన్సీతో పాటు ఐపీఎల్లో బాధ్యతగా ఆడే సంజూ శాంసన్ను సెలెక్టర్లు పక్కన పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే జట్టులో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ ముగ్గురు వికెట్ కీపర్ కం బ్యాటర్లు ఉండడంతో మరో వికెట్ కీపర్ ను ఎంపిక చేసే సాహాసానికి బీసీసీఐ పూనుకోలేదు. ఇక త్రిపాఠిని కాదని ఎప్పుడో ఒక మ్యాచ్ ఆడే రుతురాజ్ గైక్వాడ్, వెంకటేష్ అయ్యర్ లను ఎంపిక చేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications