హైదరాబాద్: కొత్త జట్ల మధ్య సమరం.. గెలుపుకోసం ఆటగాళ్లు పడుతున్న ఆరాటం అంతాఇంతా కాదు. ఇదే క్రమంలో.. నేపాల్ జట్టు ఆటగాళ్లు తమ టార్గెట్ను కాపాడుకునే దిశగా మరింత శ్రమించారు. ఆఖరి బంతి వరకూ విజయంపై సందేహం నెలకొనడంతో.. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఇటీవల వన్డేల్లో అరంగేట్రం చేసిన నేపాల్ జట్టు అద్భుతమైన విజయాన్ని అందుకుంది. శుక్రవారం నెదర్లాండ్స్తో ఉత్కంఠ భరితంగా జరిగిన రెండో వన్డేలో నేపాల్ పరుగు తేడాతో విజయం సాధించింది.
ఆఖరి బంతికి నెదర్లాండ్స్ చివరి వికెట్ను సాధించి మరీ నేపాల్ గెలుపును సొంతం చేసుకుంది. ఇది వన్డేల్లో నేపాల్కు తొలి గెలుపు. నెదర్లాండ్స్తో రెండు వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన ఆఖరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.5 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. అయితే లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 215 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. నెదర్లాండ్స్ మూడో వికెట్కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసినప్పటికీ, చివరకు పరాజయం తప్పలేదు.
ఇన్నింగ్స్ ఆఖరి బంతికి నెదర్లాండ్స్ రెండు పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. కాగా, నెదర్లాండ్ ఆటగాడు ఫ్రెడ్ క్లాసెన్ రనౌట్ అయ్యాడు. దాంతో నేపాల్కు తొలి గెలుపు దక్కింది. అదే సమయంలో ఈ సిరీస్ 1-1తో సమం అయ్యింది. తొలి వన్డేలో నెదర్లాండ్స్ 55 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవలే నేపాల్తో పాటు నెదర్లాండ్, యూఏఈ, స్కాట్లాండ్ జట్లకు వన్డే హోదా దక్కిన సంగతి తెలిసిందే. జూన్1 నుంచి ఆయా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ల ఆధారంగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ను కూడా కేటాయించునున్నారు.
గతేడాది ఐసీసీ నిర్వహించిన వరల్డ్ క్రికెట్ లీగ్ చాంపియన్షిప్లో నెదర్లాండ్స్ విజేతగా నిలవడంతో దానికి వన్డే హోదా దక్కింది. మరొకవైపు ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీలో మెరుగైన స్థానాల్లో నిలవడం ద్వారా స్కాట్లాండ్, యూఏఈ, నేపాల్ జట్లకు వన్డే హోదా లభించింది. అయితే నేపాల్ ఖాతాలో ఒక్క రేటింగ్ పాయింట్ కూడా లేకపోగా, నెదర్లాండ్స్కు 13 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ర్యాంకుల కోసం ఈ రెండు జట్లు చెరో నాలుగేసి మ్యాచ్లు ఆడిన తర్వాత మాత్రమే వాటికి ర్యాంకులు లభిస్తాయి.