మెల్బోర్న్: ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ కెప్టెన్ టిమ్ పైన్పై ఆ జట్టు స్పిన్నర్ నాథన్ లియోన్ ప్రశంసల జల్లు కురిపించాడు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టు సారథ్య బాధ్యతలు అందుకున్న పైన్.. పూర్వవైభం తీసుకొచ్చేందుకు శ్రమించాడని కొనియాడాడు. కెప్టెన్గా పైన్ రోజు రోజుకి పరిపక్వత చెందుతున్నాడని, భవిష్యత్తులో అత్యత్తమ కెప్టెన్గా ఎదుగుతాడని లియోన్ జోస్యం చెప్పాడు.
2018లో ఆస్ట్రేలియా క్రికెట్ను కుదిపేసిన బాల్ ట్యాంపరింగ్ వివాదంతో స్టివ్ స్మిత్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోగా.. టిమ్ పైన్ జట్టును నడిపించాడు.
అతని సారథ్యంలో భారత జట్టుకు టెస్టు సిరీస్ కోల్పోయినా ఇంగ్లండ్తో జరిగిన యాషెస్ సిరీస్ను నిలబెట్టుకున్నామని లియోన్ చెప్పుకొచ్చాడు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియా మాట్లాడిన లియోన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
'బాల్ ట్యాంపరింగ్ వివాదం మా జీవితాంతం వెంటాడుతుంది. అలాంటి కష్టకాలంలో ఉన్న జట్టును తన నాయకత్వ ప్రతిభతో మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు పైన్ ప్రయత్నించాడు. కెప్టెన్గా టిమ్ పైన్ తన విశ్వసనీయతను కాపాడుకుంటునే జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. అతని నిజాయితే పైన్ను ఏదో ఒకరోజు ఉత్తమ కెప్టెన్గా నిలబెడుతుంది. రోజు రోజుకు కెప్టెన్సీలో పైన్ మరింత రాటు దేలుతున్నాడు' అంటూ ప్రశంసలు కురిపించాడు.
కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం అన్ని క్రీడలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో జరగాల్సిన సిరీస్ను క్రికెట్ ఆస్ట్రేలియా జూన్ నెలకు వాయిదా వేసింది. అయితే ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానాల్లో ఆడాలనేది మన చేతుల్లో లేదని, వైద్య నిపుణలు సలహాలు పాటించడమే ప్రస్తుతం మనం చేయాల్సిన పనని లియోన్ అభిప్రాయపడ్డాడు.