
సిడ్నీ: టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను ఔట్ చేయడానికి కావాల్సిన ప్రణాళికలు తమ దగ్గర సిద్దంగా ఉన్నాయని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ తెలిపాడు. సిడ్నీ వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టులో రోహిత్ శర్మ కోసం టీమిండియా మేనేజ్మెంట్ ఎవరిపై వేటు వేయబోతుంది..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందన్నాడు.
సిడ్నీలో 14 రోజులు క్వారంటైన్ను పూర్తి చేసుకుని ఇటీవల భారత జట్టుతో రోహిత్ శర్మ చేరగా.. అతన్ని వైస్ కెప్టెన్గా టీమిండియా మేనేజ్మెంట్ నియమించింది. దాంతో.. సిడ్నీ టెస్టులో అతను ఆడటం ఖాయమవగా.. అతని కోసం ఓపెనర్ మయాంక్ అగర్వాల్ లేదా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ హనుమ విహారి తమ స్థానాన్ని త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో వరల్డ్ బెస్ట్ బ్యాట్స్మెన్ అయిన రోహిత్ రాకను ఉద్దేశించి లయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'వరల్డ్ బెస్ట్ బ్యాట్స్మెన్లలో రోహిత్ శర్మ కూడా ఒకడు. అతను టీమ్లో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు సవాల్ తప్పదు. టీమిండియా బ్యాటింగ్ లైనప్పైనా అతని ప్రభావం ఉంటుంది. కానీ సిడ్నీ టెస్టులో అతని కోసం ఎవరిపై వేటు వేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే రోహిత్ శర్మను ఔట్ చేసేందుకు మా వద్ద ప్రణాళికలు సిద్దంగా ఉన్నాయి. వీలైనంత త్వరగా అతన్ని పెవిలియన్కు చేర్చుతాం.'అని నాథన్ లయన్ హెచ్చరికలు జారీ చేశాడు.
ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన రెండు టెస్టుల్లోనూ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అంచనాల్ని అందుకోలేకపోయాడు. దాంతో అతనిపై వేటు వేయాలని కొంత మంది మాజీ క్రికెటర్లు సూచనలు చేస్తున్నారు. అలానే మిడిలార్డర్లో హనుమ విహారిని తప్పించి ఓపెనర్ శుభమన్ గిల్ను నెం.5లో ఆడించాలని సునీల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సూచిస్తున్నారు. తద్వార రోహిత్ శర్మతో పాటు మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగాలని సలహా ఇస్తున్నారు.