పోటీనిచ్చే జట్టుగా మార్చాడు..
‘గంగూలీ తన సారథ్యంతో భారత్ను పోటీనిచ్చే జట్టుగా తీర్చిదిద్దాడు. ఆ ఆటగాళ్లంతా నిరాడంబరంగా ఉంటారు. ఉదయం లేవగానే గుడ్మార్నింగ్ నాజర్ అని విష్ చేసేవాళ్లు. ఆ అనుభవం ఎంతో బాగుంటుంది. ఇక గంగూలీ సారథ్యంలోని టీమిండియాతో ఆడటం యుద్ధాన్ని తలపించేది. క్రికెట్ పట్ల భారత అభిమానులకున్న ఇష్టాన్ని అతను అర్థం చేసుకున్నాడు. వాళ్లకది క్రికెట్ మాత్రమే కాదు. అంతకుమించి ఎంతో ముఖ్యమైనది' అని నాజర్ చెప్పుకొచ్చాడు.
దాదా ఆటగాళ్లంతా..
దాదా దూకుడైన కెప్టెన్ అని, అతను తీసుకునే ఆటగాళ్లు కూడా అలాంటి వారేనని చెప్పాడు. ఉదాహరణకు హర్భజన్, యువరాజ్ సింగ్ పేర్లను వెల్లడించాడు. వారు మైదానంలో ఎంతలా రెచ్చిపోతారో బయట అంత సరదాగా, స్నేహంగా ఉంటారని తెలిపాడు. సాధారణ టీమిండియాను మేటి జట్టుగా తీర్చిదిద్దిన దాదా.. యువ క్రికెటర్లను ప్రోత్సహించి వారిని మ్యాచ్ విజేతలుగా మలిచాడు. ఆటగాళ్లలో విజయకాంక్షతో పాటు ప్రత్యర్థల కవ్వింపులకు దీటుగా సమాధానం ఇచ్చేలా ప్రోత్సహించాడు. ఈ క్రమంలోనే విదేశాల్లోనూ భారత జట్టు నిలకడగా రాణించేలా చేశాడు.
అసహ్యించుకునేవాడిని..
ఇక గంగూలీతో ఆడినప్పుడల్లా అతన్ని అసహ్యించుకునేవాడినని నాజర్ గుర్తు చేసుకున్నాడు.‘గంగూలీతో ఆడుతునప్పుడల్లా అతన్ని అసహ్యించుకునేవాడిని. ఎందుకంటే టాస్కు వెళ్లిన ప్రతీసారి అతను నన్ను వెయిట్ చేయించేవాడు. టైమ్ అయిపోయింది మనం టాస్ వేయాలని నేను చెప్పాల్సి వచ్చేది. కానీ గత దశాబ్ధకాలంగా కామెంటేటర్గా అతని పనిచేస్తున్నా. అతనో మంచి వ్యక్తి. ప్రశాంతత కలిగినవాడు. కామెంట్రీ చెప్పడానికి కూడా అతను ఆలస్యంగానే వస్తున్నాడు. కానీ ఇప్పుడు అతనిపై ఎలాంటి అసహ్యం కలగడం లేదు. ఇతురులతో తలపడినప్పుడు కానీ కలిసి ఆడినప్పుడు కానీ వారంటే మనకు నచ్చదు. కానీ మైదానం వెలుపల వారి మంచితనం మనకు తెలుస్తుంది'అని నాజర్ చెప్పుకొచ్చాడు.
మరవలేని క్షణం..
దాదా సారథ్యంలో భారత జట్టు ఎన్నో మధురమైన విజయాలు సాధించింది. వాటిలో ఒకటి 2002 నాట్వెస్ట్ సిరీస్ ఫైనల్. అప్పుడు యువ క్రికెర్లుగా ఉన్న యువీ, కైఫ్ మ్యాచ్ను గెలిపించారు. దాంతో లార్డ్స్ మైదానం బాల్కనీలో గంగూలీ సంబరాలు అంతా ఇంతా కాదు. ఆ రోజు జెర్సీ విప్పి తిప్పడం టీమ్ఇండియా అభిమానులెప్పటికీ మర్చిపోరు.
ఈ ఫైనల్లో నాజర్ హుస్సేన్ 128 బంతుల్లో 115 పరుగులు చేశాడు. కానీ.. అద్భుత పోరాట పటిమ కనబర్చిన టీమిండియా.. 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి టైటిల్ని కైవసం చేసుకుంది.