ముంబై: వెటరన్ ముంబై ఆల్రౌండర్ అభిషేక్ నాయర్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నానని 36 ఏళ్ల నాయర్ బుధవారం ప్రకటించాడు. 'క్రికెట్కు వీడ్కోలు పలకడం గౌరవంగా భావిస్తున్నా. నా కెరీర్లో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కెరీర్ ఆరంభం నుండి నన్ను ప్రోత్సహించిన కుటుంబ సబ్యులకు కృతజ్ఞతలు. క్రికెట్లో మళ్లీ పునరాగమనం చేయను' అని అభిషేక్ ట్వీట్ చేశాడు.
సమ్మె విరమించుకున్న బంగ్లా క్రికెటర్లు.. షెడ్యూల్ ప్రకారమే భారత పర్యటన!!
1983లో సికింద్రాబాద్లో జన్మించిన అభిషేక్ నాయర్.. 2009లో భారత్ తరఫున మూడు వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. రెండు మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక మూడో మ్యాచ్లో క్రీజులో అడుగుపెట్టిన అభిషేక్.. ఏడు బంతులు ఆడి పరుగులేమీ చేయకుండా నాటౌట్గా నిలిచాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో అభిషేక్ ఆడాడు. మొత్తానికి అభిషేక్ భారత్ తరఫున ఒక్క పరుగు కూడా చేయలేదు. భారత్ తరఫున బరిలోకి దిగి పరుగులేమీ చేయకుండా ఉంది అభిషేక్ నాయర్ మాత్రమే.
భారత్ తరఫున మూడు వన్డేలే ఆడిన అభిషేక్ నాయర్ ముంబై తరఫున 103 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడాడు. ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 45.62 సగటుతో 5,749 పరుగులు చేశాడు. దీనిలో 13 శతకాలు, 32 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 31.47 సగటుతో 173 వికెట్లు కూడా పడగొట్టాడు. 99 లిస్ట్-ఎ మ్యాచులు ఆడిన అభిషేక్ 2,145 పరుగులు, 79 వికెట్లు తీశాడు.
కేరళకు చెందిన అభిషేక్ నాయర్ కుటుంబం కొంతకాలం హైదరాబాద్లో నివాసం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అభిషేక్ నాయర్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, పుణే వారియర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్ల తరఫున ఆడాడు. కోల్కతా నైట్ రైడర్స్కు అభిషేక్ నాయర్ అసిస్టెంట్ కోచ్గా ఎంపికైన విషయం తెలిసిందే.
అభిషేక్ ట్వీట్పై భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే స్పందించాడు. 'క్రికెట్ వీడ్కోలు పలికిన ముంబై భాగస్వామికి అభినందనలు. నీతో కలిసి ఆడినందుకు ఎంతో ఆనందంగా ఉంది' అని ట్వీట్చేశాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మెక్కలమ్ కూడా అభిషేక్ నాయర్కు శుభాకాంక్షలు తెలిపాడు. నైట్ రైడర్స్కు మెక్కలమ్ ప్రధాన కోచ్.