ఐపీఎల్ 2021 ఆడతాడు:
ధోనీ సన్నిహిత వర్గ సమాచారం ప్రకారం 2021 ఐపీఎల్ తర్వాతే వీడ్కోలు ఉంటుందట. 'ఐపీఎల్ 2021 ముందు వేలం ఉంటుంది. ఐపీఎల్ 2021 ఆడతానని ధోనీ మాకు తెలిపాడు. టీ20లకు సమీప భవిష్యత్తులో మహీ వీడ్కోలు పలుకుతాడన్న సందేహమే లేదు. వేలంలోకి మహీ వెళ్లాలని అనుకుంటున్నాడు' అని చెన్నై జట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఇప్పటి కన్నా ఇంకాస్త తక్కువ ధరకే:
'మహీ వేలంలోకి వెళితే రైట్ టు మ్యాచ్ నిబంధన ఉపయోగించుకొని అతడిని తీసుకొనే అవకాశం చెన్నైకే ఉంటుంది. ఇప్పటి కన్నా ఇంకాస్త తక్కువ ధరకే చెన్నై అతడిని దక్కించుకోవచ్చు. ఒక సారథిగా చెన్నై కోసం అతడు కొంత డబ్బును త్యాగం చేసేందుకూ కూడా సిద్ధంగా ఉన్నాడు' అని చెన్నై సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
2021 ఐపీఎల్ తర్వాతే వీడ్కోలు:
'మహీ ఏం చేస్తున్నాడో టీమిండియా యాజమాన్యానికి అర్థం కావడం లేదన్న భావన ప్రస్తుతం ఉంది. అది నిజం కాదు. మహీ ఐపీఎల్ బాగా ఆడితే.. 2020 డిసెంబర్లో జరిగే ప్రపంచకప్లో కచ్చితంగా ఉంటాడు. 2021 ఐపీఎల్ తర్వాతే వీడ్కోలు సంగతి తెలుస్తుంది. ఒకవేళ ధోనీ వీడ్కోలు పలికినా.. చెన్నై జట్టుకి మార్గనిర్దేశకుడిగా ఉంటాడు' అని ఆ వర్గాలు వెల్లడించాయి.
సీనియర్ ఆటగాళ్లే ఎక్కువ:
ప్రస్తుతం చెన్నైలో సీనియర్ ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. మురళి విజయ్, అంబటి రాయుడు, హర్భజన్ సింగ్, షేన్ వాట్సన్, డ్వేన్ బ్రావో, ఇమ్రాన్ తాహిర్ వంటి క్రికెటర్లు జట్టుకు దూరమయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 2021లో జరిగే భారీ వేలంలో కొత్త ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేయడంలో ధోనీదే కీలక పాత్ర. ఈ నేపథ్యంలో ఎట్టిపరిస్థితుల్లోనూ చెన్నై యాజమాన్యం ధోనీని వేలంలోకి పంపించదు.
రవిశాస్త్రి స్పష్టమైన సంకేతాలు:
ధోనీ రిటైర్మెంట్ వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనీ ఇప్పట్లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగబోరని ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. 'ఐపీఎల్లో ధోనీ ఎలా ఆడుతున్నాడన్న దానిపైనే రిటైర్మెంట్ ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్ పెద్ద టోర్నమెంట్. అందులో ఎలా ఆడుతున్నారన్నది గమనించిన తర్వాత టీ20 వరల్డ్కప్ కోసం తుది జట్టును ప్రకటిస్తారు' అని రవిశాస్త్రి తెలిపాడు.