సన్రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ వైఫల్యం కొనసాగుతోంది. ఐపీఎల్ 2026 సీజన్లోనూ అభిషేక్ శర్మ శుభారంభం అందుకోలేకపోయాడు. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు(ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపర్చాడు. 8 బంతుల్లో ఒక సిక్సర్తో 7 పరుగులే చేసి వెనుదిరిగాడు.
జాకోబ్ డఫీ వేసిన మూడో ఓవర్లో భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. జాకోబ్ డఫీ వేసిన షార్ట్ బాల్ను అభిషేక్ శర్మ పుల్ షాట్ ఆడబోయాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేవగా.. కీపర్ జితేష్ శర్మ పరుగెత్తి క్యాచ్ తీసుకున్నాడు. దాంతో సన్రైజర్స్ 18 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఇదే ఓవర్ ఆఖరి బంతికి ట్రావిస్ హెడ్(11) కూడా క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలోనూ అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపర్చిన సంగతి తెలిసిందే. వరుసగా మూడు మ్యాచ్ల్లో డకౌట్ అయిన అతను జింబాబ్వేపై హాఫ్ సెంచరీ బాదినా తర్వాతి మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో మాత్రం హాఫ్ సెంచరీ చేశాడు. కానీ ఆ జోరును ఐపీఎల్లో కొనసాగించలేకపోయాడు. ఉప్పల్ వేదికగా జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో భారీ సిక్సర్లతో మంచి టచ్లో కనిపించిన అభిషేక్ శర్మ.. ఆర్సీబీ మాత్రం తీవ్రంగా తడబడ్డాడు. జాకోబ్ డఫీ, భువనేశ్వర్ కుమార్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయాడు.
దాంతో అభిషేక్ శర్మపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు సన్రైజర్స్ ఫ్యాన్స్ అతనికి పులి అనే ట్యాగ్ ఇవ్వగా.. దానికి న్యాయం చేయలేకపోయాడు. దాంతో పులి.. పిల్లి అయ్యిందని యాంటీ ఫ్యాన్స్ ఎగతాళి చేస్తున్నారు. ఈ సీజన్లో కూడా సన్రైజర్స్ హైదరాబాద్కు కష్టాలు తప్పేలా లేవని కామెంట్ చేస్తున్నారు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే చిన్నస్వామి స్టేడియంలోనూ ఆడకపోతే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు.
అభిషేక్ శర్మతో పాటు ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి(1) తీవ్రంగా నిరాశపర్చారు. జాకోబ్ డఫీ బౌలింగ్లోనే నితీష్ కుమార్ రెడ్డి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. బ్యాటింగ్ చేసేందుకు ఈ తెలుగు క్రికెటర్ తీవ్రంగా తడబడ్డాడు. 6 బంతుల్లో ఒకే పరుగు చేసి వెనుదిరిగాడు.