భారత క్రికెట్లో ఒక అత్యున్నత శిఖరం ఎంఎస్ ధోనీ. కెప్టెన్గా అతను జట్టుకు అందించిన విజయాలు మరువలేనివి. అయితే అతనికి సెండాఫ్ మ్యాచ్ లేకుండానే అంతర్జాతీయ కెరీర్ ముగించాల్సి వచ్చింది. కరోనా లాక్డౌన్ సమయంలో అతను తన అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు. ఇక అతని ఆట చూడాలంటే ఐపీఎల్ ఒక్కటే దిక్కు అయింది.
ఈ క్రమంలో ఇప్పుడు ఐపీఎల్కు కూడా ధోనీ వీడ్కోలు పలుకుతాడని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ 16వ సీజన్ ధోనీకి చివరిదని, తరువాతి నుంచి ఐపీఎల్లో అతను ఆడడని అంతా అనుకుంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కూడా దీనికి ఫిక్స్ అయిపోయారు. కానీ ఈ విషయంపై ధోనీ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. గతేడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందే సీఎస్కే కెప్టెన్సీని ధోనీ వదిలేశాడు.

అతని నుంచి పగ్గాలు అందుకున్న జడేజా ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీంతో మళ్లీ జట్టు సారధ్య బాధ్యతలను ధోనీనే తీసుకున్నాడు. ఈ క్రమంలోనే తన చివరి మ్యాచ్ కచ్చితంగా చెపాక్లో తన ఫ్యాన్స్ ముందు ఆడతానని చెప్పాడు. దీంతో అతను ఈ ఏడాది చెపాక్లో తన చివరి మ్యాచ్ ఆడతాడని, అనంతరం ఐపీఎల్కు కూడా వీడ్కోలు చెప్పేస్తాడని వార్తలు గుప్పుమన్నాయి. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఇదే జరుగుతుందని అనుకుంటున్నారు.
ఇలాంటి సమయంలో ధోనీ తన రిటైర్మెంట్ నిర్ణయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక కార్యక్రమంలో తోటి సీఎస్కే ఆటగాళ్లతో కలిసి పాల్గొన్న ధోనీని ఈ రిటైర్మెంట్ వార్తల గురించి ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన అతను.. 'ఆ నిర్ణయం తీసుకోవడానికి చాలా టైం ఉంది. ప్రస్తుతం మా ముందు చాలా మ్యాచులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏమైనా చెప్తే కోచ్పై బాగా ఒత్తిడి పడుతుంది' అని చెప్పుకొచ్చాడు. దీంతో అతను ఈ సీజన్ చివర్లో రిటైర్మెంట్పై ప్రకటన చేసేలా కనిపిస్తున్నాడు.