కెరీర్ చరమాంకంలో ఉన్నప్పటికీ:
కెరీర్ చరమాంకంలో ఉన్నప్పటికీ భారత్లో అత్యంత డిమాండ్ ఉన్న క్రికెటర్లలో మహీ ఒకడు. అతడి బ్రాండ్ విలువ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రెండంకెల సంఖ్యలో బ్రాండ్లకు అతను ప్రచారం చేస్తున్నాడు. కొత్త ఒప్పందాల కోసం అతడి వెంట పడే వారూ తక్కువేమీ కాదట. అయితే ప్రస్తుత కరోనా సంక్షోభం నేపథ్యంలో కొత్తగా ప్రకటనలేవీ చేయొద్దని మహీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ధోనీ సేంద్రియ వ్యవసాయంపై దృష్టిసారించాడని, ప్రకటనల కోసం సంస్థలు సంప్రదిస్తుంటే ఇప్పుడు చేయనని చెప్పేస్తున్నాడట.
సొంత బ్రాండ్తో మార్కెట్లోకి ఎరువులు:
ఎంఎస్ ధోనీ మంగళవారం 39వ పుట్టిన రోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా మహీ చిన్ననాటి స్నేహితుడు, మేనేజర్ మిహిర్ దివాకర్ మాట్లాడుతూ... 'ధోనికి సుమారు 50 ఎకరాల పొలం ఉంది. అతనికి సైనికుడిగా పని చేయడమన్నా, రైతుగా పని చేయాలన్నా బాగా ఇష్టం. ఇప్పుడతను తన పొలంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు. మా వద్ద పలువురు వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు ఉన్నారు. వారు కొత్త రకం సేంద్రీయ ఎరువును అభివృద్ధి చేశారు. రెండు, మూడు నెలల్లో నియో గ్లోబల్ పేరుతో మార్కెట్లోకి తెస్తాం' అని తెలిపాడు.
సేంద్రీయ వ్యవసాయానికి బ్రాండ్ అంబాసిడర్గా:
'ధోనీ గత నాలుగు నెలలుగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు. బొప్పాయి, అరటిని సాగు చేస్తున్నాడు. కరోనా తగ్గి పరిస్థితులు చక్కబడే వరకు ఎలాంటి వాణిజ్య ప్రకటనల్లో పాల్గొనరాదని మహీ నిర్ణయించుకున్నాడు. అయితే సేంద్రీయ వ్యవసాయానికి మాత్రం బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాడు' అని మిహిర్ దివాకర్ అన్నాడు. ఇటీవల ధోనీ ట్రాక్టర్ నడుపుతున్న ఫొటోలు నెట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
చార్టర్ ఫ్లైట్లో రాంచీకి:
మంగళవారం ఎంఎస్ ధోనీ పుట్టిన రోజు సందర్భంగా మాజీలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ.. ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యాతో పాటు అనేకమంది సెలెబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు. పాండ్యా బ్రదర్స్ ప్రత్యేక విమానంలో బరోడా నుంచి రాంచీకి వెళ్లి ధోనీకి విషెస్ చెప్పడం విశేషం. రోజంతా ధోనీ ఇంట్లోనే గడిపిన బ్రదర్స్.. బుధవారం స్వస్థలం రానున్నట్టు సమాచారం.ఇక వెస్టిండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో అయితే మహీ బర్త్డే గిఫ్ట్గా 'నంబర్ 7' పేరుతో పాటను విడుదల చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్ షురూ.. ఇంగ్లండ్-వెస్టిండీస్ తొలి టెస్టు నేడే!!