59 బంతుల్లో 37 పరుగులు
రెండో వన్డేలో ధోని 59 బంతుల్లో 37 పరుగులు మాత్రమే చేశాడు. అందులో రెండు బౌండరీలు మాత్రమే ఉన్నాయి. 323 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా వెనువెంటనే టాపార్డర్ వికెట్లు చేజార్చుకుంది. మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగిన ధోని నెమ్మదిగా ఆడాడు. డెత్ ఓవర్లలో ఫ్లంకెట్ వేస్తున్న బంతులను బాదకుండా ధోని డిఫెండ్ మాత్రమే చేశాడు.
86 పరుగుల తేడాతో భారత్ ఓటమి
దీనిని చూసి అసహనానికి గురైన కొందరు అభిమానులు మైదానంలోనే విమర్శలు చేశారు. 86 పరుగుల తేడాతో భారత్ ఈ మ్యాచ్లో ఓడిపోయింది. చివర్లో ధోని దూకుడుగా ఆడి ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. తన కెరీర్లో మాయని మచ్చగా మిగిలిపోయిన ఇన్నింగ్స్ను తాజాగా ధోని గుర్తు చేశాడని గవాస్కర్ పేర్కొన్నాడు.
174 బంతులను ఎదుర్కొన్న గవాస్కర్ 36 పరుగులు
ఇంగ్లండ్లో ఇదే లార్డ్స్ వేదికగా 1975 వరల్డ్కప్లో భాగంగా జరిగిన మ్యాచ్లో 174 బంతులను ఎదుర్కొన్న గవాస్కర్ కేవలం 36 పరుగులు మాత్రమే చేసి తీవ్ర విమర్శల పాలయ్యాడు. ఈ ఇన్నింగ్స్ గవాస్కర్ క్రికెట్ చరిత్రలోనే ఓ మాయని మచ్చ ఇన్నింగ్స్ లాగా మిగిలిపోయింది. ఇటీవల ధోని ఇన్నింగ్స్ను అప్పటి తన ఇన్నింగ్స్తో పోల్చుతూ గవాస్కర్ మాట్లాడాడు.
నా ప్రసిద్ధ చెత్త ఇన్నింగ్స్ను గుర్తుకు తెచ్చిన ధోని
"తాజాగా లార్డ్స్ మైదానంలో ధోని ఆడిన ఇన్నింగ్స్.. నా ప్రసిద్ధ చెత్త ఇన్నింగ్స్ను గుర్తుకు తెచ్చింది. అయితే ఈ మ్యాచ్లో ధోని ఆటతీరును పూర్తిగా విమర్శించకూడదు. ఎందుకంటే అప్పటికే టీమిండియా ఓటమి ఖరారైపోయింది. ఆ సమయంలో మంచి షాట్లు ఆడే ఆత్మవిశ్వాసం ఆటగాళ్లకు ఉండదు" అని గవాస్కర్ పేర్కొన్నాడు.