రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మెంటార్ దేవల్ సహాయ్ మృతి చెందారు. శరీరంలోని పలు అవయవాలు దెబ్బతినడంతో ఆయన మంగళవారం ఉదయం రాంచీలోని ఓ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. ధోనీ కోసం దేవల్ సహాయ్ రాంచీలో టర్ఫ్ పిచ్లు ఏర్పాటు చేశారు. 73 ఏళ్ల సహాయ్ అసలు పేరు దియోబ్రత్ కానీ ఆయన దేవల్గానే గుర్తింపు పొందారు. శ్వాస సంబంధ సమస్యల కారణంగా ఆసుపత్రిలో 40 రోజులపాటు చికిత్స తీసుకున్న ఆయన అక్టోబర్ 9న డిశ్చార్జయ్యారు.
కానీ పది రోజుల తర్వాత మళ్లీ అనారోగ్యం బారిన పడటంతో సహాయ్ను ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు తన తండ్రి చనిపోయారని సహాయ్ కుమారుడు అభినవ్ ఆకాశ్ సహాయ్ మీడియాకు తెలిపారు. అమెరికాలో నివసిస్తున్న సహాయ్ కుమార్తె మీనాక్షి ఇటీవలే రాంచీకి వచ్చారు.
ఎలక్ట్రికల్ ఇంజినీర్ అయిన సహాయ్.. రాంచీలో ధోనీ కోసం తొలిసారి పచ్చిక (టర్ఫ్) పిచ్లను రూపొందించారు. మెకాన్లో చీఫ్ ఇంజినీర్గా పని చేసిన సహాయ్.. సెంట్రల్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) డైరెక్టర్గా పదవీ విరమణ చేశారు. సీసీఎల్లో పని చేస్తుండగానే ధోనీకి టర్ఫ్ పిచ్ల మీద ఆడే అవకాశం కల్పించారు. ధోనీ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ఎంఎస్ ధోనీ: ది అన్టోల్డ్ స్టోరీ' చిత్రంలోనూ సహాయ్ పాత్ర కనిపిస్తుంది.