టాప్ స్పెషలిస్ట్లను కాదని..
సుమారు రూ.846 కోట్ల ఆస్థి కలిగిన ధోనీ.. మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవడం కోసం రూ.40 రూపాయాల నాటు వైద్యం తీసుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అవసరమైతే ప్రపంచంలోనే టాప్ స్పెషలిస్ట్ డాక్టర్లను తన దగ్గరకు రప్పించుకొని వైద్యం చేయించుకోగల సౌకర్యం కలిగిన ధోనీ.. నాటు వైద్యం కోసం ఏకంగా 70 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడట. ధోనీ నాటు వైద్యానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఇదే సమస్యతో బాధపడిన తన తల్లిదండ్రులకు ఈ వైద్యం బాగా పనిచేయడంతో ధోనీ కూడా వారి బాటలో నడుస్తున్నాడట.
తల్లిదండ్రులకు నయమవడంతో..
ధోనీ గత కొంతకాలంగా మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నాడు. దాంతో నాటువైద్యం కోసం మహీ.. రాంచీ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంపంగ్లోని స్థానిక నాటు వైద్యుడు వందన్ సింగ్ ఖేర్వార్ వద్దకు వెళుతున్నాడు. అక్కడ వనమూలికలతో చేసిన మందును తాగుతున్నాడు. ధోనీ ఇప్పటికే నాలుగు డోసులు తీసుకున్నాడు. ఒక్కో డోస్కి కేవలం రూ. 40 రూపాయలు చెల్లిస్తున్నాడు. మహీ శరీరంలో కాల్షియం లోపం ఉన్నందునే ఇలా జరుగుతుందని సదరు వైద్యుడు చెప్పాడు.
జనం గుర్తు పట్టడంతో..
నాటువైద్యం కోసం ఎంఎస్ ధోనీ స్వయంగా రాంచీ నుంచి 70 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేసుకుంటూ లాంపంగ్కు వెళుతున్నాడు. ఈ క్రమంలోనే జూన్ 26వ తేదీన నాటు వైద్యుడు వందన్ సింగ్ ఖేర్వార్ వద్దకు తన డోస్ తీసుకోవడానికి ధోనీ వెళ్ళాడు. మహీని గుర్తుపట్టిన అక్కడి జనం అతడి చుట్టూ గుమిగూడారు. ఆపై వారు మహీతో సెల్ఫీలు దిగి సంతోషపడ్డారు. ఆ ఫొటోలు కాస్త నెట్టింట వైరల్ కావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మోకాళ్ల నొప్పికి చికిత్స కోసం ధోనీ తల్లిదండ్రులు కూడా అతని వద్దకు ఇదివరకు వెళ్లారట. వారికీ నయమవడంతో మహీ కూడా అక్కడికి వెళుతున్నాడు.
ధోనీని గుర్తుపట్టలేదు..
నాటు వైద్యుడు వందన్ సింగ్ మాట్లాడుతూ... 'చికిత్స కోసం ఎంఎస్ ధోనీ నా వద్దకు మొదటిసారి వచ్చినప్పుడు నేను గుర్తించలేకపోయా. సాధారణ వ్యక్తిలా వచ్చి తన సమస్యను చెప్పాడు. మందు ఇస్తే తిన్నాడు. డోస్కి 40 రూపాయలు ఇచ్చాడు. ధోనీ కారు చూసి పక్కనే ఉన్న అబ్బాయిలు పెద్దగా అరిచారు. అప్పుడు కానీ విషయం తెలియలేదు. మోకాళ్ల నొప్పికి చికిత్స కోసం ధోనీ తల్లిదండ్రులు కూడా నా వద్దకు వచ్చారు. వారికి చాలా ఉపశమనంగా అనిపించడంతో మహీ కూడా వస్తున్నాడు' అని తెలిపాడు.