కొత్త కారులో షికారు:
ఇటీవల కొన్న 'రెడ్బీస్ట్' జీప్ చెరోకీ ట్రాక్హక్ ఎస్యూవీని ధోనీ తొలిసారి నడిపాడు. ధోనీ రాంచీలో కారు నడుపుతూ అభిమానుల కంట పడ్డాడు. ధోనీ జీపు నడుపుతున్న ఫొటోలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమెరికా పర్యటన అనంతరం రాంచీ చేరుకున్న ధోనీని.. విమానాశ్రయంలో రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వారితో కలిసి మహీ కారులో వెళ్లాడని సమాచారం తెలుస్తోంది. ధోనీ పక్కనే ఆయన సతీమణి సాక్షి కూడా ఉంది.
ఇదే తొలి కారు:
ధోనీ సైనిక విధుల్లో ఉండగా కొత్త జీపు ఇంటికి చేరుకుందంటూ సాక్షి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. 'రెడ్బీస్ట్కు స్వాగతం. నీకు ఇష్టమైన కారు ఎట్టకేలకు గ్యారేజ్కు వచ్చి చేరింది. నేను నిన్ను మిస్ అవుతున్నా. దేశంలో ఎవరి వద్ద కూడా ఇలాంటి కారు లేదు. ఇదే తొలి కారు' అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అయితే ఈ జీపు ధర భారత దేశంలో అక్షరాలా రూ.1.12 కోట్లు (ఎక్స్-షోరూమ్).
రిపేర్ కూడాచేస్తుంటాడు:
ధోనీ బైకులు నడుపడమే కాదు వాటి రిపేర్ కూడా చేసుకుంటాడు. గతంలో వాటికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. రైడింగ్స్, బైక్ ఫెస్టివల్స్లో పాల్గొని ధోనీ తనలోని వాహన ప్రేమికుడినని చాటుకుంటున్నాడు. రకరకాల బైకులతో పాటు ధోని దగ్గర వింటేజ్ బండ్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే ధోనీ వద్ద ఫెరారీ 599 జీటీవో, హమ్మర్ హెచ్2 ఉన్నత స్థాయి కార్లతో పాటు కవాస్కీ నింజా, బీఎస్ఏ, సుజుకీ హయబుషా ద్విచక్రవాహనాలు కూడా ఉన్నాయి.
రిటైర్మెంట్పై ఎలాంటి సమాచారం లేదు:
ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే గత కొద్దికాలంగా పేలవ ఫామ్తో సతమతమవుతున్న ధోనీపై విమర్షల వర్షం కురుస్తోంది. ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతో రెండు నెలల పాటు క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్రమంలో విండీస్, సౌతాఫ్రికా పర్యటనల నుండి స్వయంగా తప్పుకున్నాడు. ధోనీ తన రిటైర్మెంట్పై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో రకరకాల ఉహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.