IPL 2026: ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ ఐపీఎల్ సీజన్ ఓ పీడకలలా మారుతోంది. సీఎస్కేతో జరిగిన ఇటీవలి మ్యాచ్లో ఓటమి పాలవ్వడంతో ముంబై తన తొమ్మిదో మ్యాచ్లో ఏడో ఓటమిని మూటగట్టుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేవలం రెండు పాయింట్లతో అట్టడుగున ఉన్న హార్దిక్ పాండ్యా సేన ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించే స్థితికి చేరుకుంది. సమీకరణాల ప్రకారం ఇంకా అవకాశం ఉన్నప్పటికీ.. ఆచరణలో ముంబై ముందడుగు వేయడం అత్యంత కష్టతరంగా కనిపిస్తోంది.
ఈ సీజన్ ఆరంభంలో 13 ఏళ్ల నాటి తొలి మ్యాచ్ ఓటమి సెంటిమెంట్ను బ్రేక్ చేస్తూ ముంబై విజయం సాధించినా.. ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయి తడబడింది. మధ్యలో గుజరాత్ టైటాన్స్ జట్టుపై తిలక్ వర్మ రాణించడంతో ఓ విజయం దక్కినప్పటికీ.. ఆ జోరును కొనసాగించడంలో ముంబై జట్టు విఫలమైంది. ముఖ్యంగా తమ సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలో వరుసగా మ్యాచ్లు ఓడిపోతుండటం ఆ జట్టు యాజమాన్యాన్ని కలవరపెడుతోంది.

సీఎస్కేతో జరిగిన తాజా మ్యాచ్లో నమన్ ధీర్ హాఫ్ సెంచరీతో ముంబై ఇండియన్స్ 159 పరుగులు చేసినప్పటికీ.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కార్తీక్ శర్మల అద్భుత భాగస్వామ్యం వల్ల ముంబైకి ఓటమి తప్పలేదు. ఈ ఓటమితో ముంబై ప్లేఆఫ్స్ చేరాలంటే ఇప్పుడు అద్భుతం జరగాల్సిందే. సాధారణంగా 16 పాయింట్లు ఉంటే ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం అవుతుంది. కానీ గతంలో ముంబై 14 పాయింట్లతో కూడా క్వాలిఫై అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ 14 పాయింట్లు సాధించాలన్నా ముంబై తమ మిగిలిన 5 మ్యాచ్ల్లోనూ తప్పక విజయం సాధించాలి.
ఆ జట్టుకు కేవలం విజయాలు మాత్రమే సరిపోవు. ముంబైకి ప్రస్తుతం ఉన్న -0.803 నెట్ రన్ రేట్ చాలా ఆందోళనకరంగా ఉంది. కాబట్టి మిగిలిన మ్యాచ్ల్లో భారీ విజయాలు నమోదు చేయడంతో పాటు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు తమ మిగిలిన మ్యాచ్ల్లో ఓడిపోవాలని ముంబై కోరుకోవాలి. ముంబై ముందున్న 5 మ్యాచ్ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి బలమైన జట్లతో తలపడాల్సి ఉంది. ఇందులో ఒక్క మ్యాచ్ ఓడినా ముంబై అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.