ఆ టోర్నీల్లో గెలవకుంటే.. కెప్టెన్గా విరాట్ కోహ్లీ తప్పుకోవాల్సిందే: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

లండన్: అప్కమింగ్ ఐసీసీ టీ20, వన్డే ప్రపంచకప్ల్లో టీమిండియా ఒక్కటి గెలవకున్నా విరాట్ కోహ్లీ సారథ్య బాథ్యతల నుంచి తప్పుకోవాల్సిందేనని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ అన్నాడు. ఇక కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ద్వైపాక్షిక సిరీస్లు చాలానే గెలిచినా.. ఐసీసీ ట్రోఫీలు గెలవడంలో మాత్రం విఫలమైంది. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో నిష్క్రమించింది.
అయితే రానున్న రెండు ప్రపంచకప్లు భారత్ వేదికగానే జరగనున్నాయి. ఈ క్రమంలోనే మాంటీ పనేసర్ 'స్పోర్ట్స్ కీదా'తో మాట్లాడుతూ.. కోహ్లీ కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాక్యలు చేశాడు. కోహ్లీ లేకున్నా భారత్ గెలవగలదని ఆసీస్ పర్యటనతో నిరూపితమైందన్నాడు.

కోహ్లీ లేకున్నా..
'ఐసీసీ అప్కమింగ్ టీ20 వరల్డ్ కప్, వన్డే ప్రపంచకప్ భారత్లోనే జరగనున్నాయి. ఈ రెండింటింలో కనీసం ఒక్కదాన్నయినా భారత్ గెలవాలి లేకుంటే విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందే. 2017 నుంచి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన కోహ్లీ ద్వైపాక్షిక సిరీస్లను గెలిచినా.. అతని ఖాతాలో ఒక్క మెగా టైటిల్ కూడా లేకపోవడం ఆశ్యర్యకరం. కోహ్లీ లేకున్నా టీమిండియా సిరీస్లు గెలవగలదని ఆసీస్ పర్యటనతో నిరూపితమైంది.

విరాట్ తప్పుకోవాల్సిందే..
విరాట్ గైర్హాజరీలో రహానే సారథ్యంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 2-1తేడాతో గెలవడమే ఇందుకు నిదర్శనం. రహానేకు వైస్ కెప్టెన్గా రోహిత్ శర్మ మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఆసీస్ గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్ను గెలిచేందుకు దోహదపడింది. దీన్నిబట్టి చూస్తే మెగా టోర్నీల్లో భారత్ విఫలమైతే కోహ్లీ కెప్టెన్సీ కోల్పోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.' అని చెప్పుకొచ్చాడు.

నియంతృత్వ పోకడ..
ఇక విరాట్ కోహ్లీ నియంతృత్వ శైలిని పక్కన బెట్టి ఇతరుల మాటలను వినాల్సిన సమయం ఆసన్నమైందని ఈ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. 'రోహిత్ శర్మ, అజింక్యా రహానేలకు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చినప్పుడు వారి కాంబినేషన్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ నాయకులను సమన్వయం చేయడంపైనే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నైపుణ్యం ఆధారపడి ఉంది. ఇది అతని సారథ్యంలో తదుపరి భాగం కానుంది. విరాట్ కోహ్లీ నియంతృత్వ శైలిని ఇష్టపడతాడు.

రోహిత్ మాట వినాలి..
కానీ ఇక నుంచి అతను ఇతర వ్యక్తుల మాటలను వినడం, సూచనలు పాటించడం మొదలుపెట్టాలి. ముఖ్యంగా టెస్ట్ సిరీస్ సమయంలో కోహ్లీ.. రోహిత్ శర్మ, రహానే, రవిశాస్త్రి సూచనలు, సలహాలను పాటించాల్సిన అవసరం ఉంటుంది.'అని పనేసర్ చెప్పుకొచ్చాడు. ఇక ఆస్ట్రేలియాలో భారత్ విజయం వెనుక రవిశాస్త్రి ఉన్నాడని తెలిపాడు.
కాగా ఇంగ్లండ్ జట్టు భారత్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. టీమిండియాతో ఇంగ్లండ్ నాలుగు టెస్టులు.. మూడు వన్డేలు.. 5 టీ20లు ఆడనుంది. చెన్నై వేదికగా ఫిబ్రవరి 5 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. జనవరి 27న చెన్నై వేదికగా ఏర్పాటు చేసిన బయోబబులోకి ఇరు జట్లు ప్రవేశించనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications