ముంబై: ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. కోహ్లీసేన అద్భుతంగా ఆడుతోంది. ఈ విజయాల వెనక ఎక్కువ మంది ఆటగాళ్లు ఉన్నారు. అత్యుత్తమైన 15-20 మంది క్రికెటర్లు కెప్టెన్ విరాట్ కోహ్లీకి అందుబాటులో ఉన్నారు. టీమిండియా జైత్రయాత్రకు ప్రధాన కారణం ఇదే అని పనేసర్ అన్నాడు. పనేసర్ తన జీవిత చరిత్ర 'ఫుల్ మాంటీ' పుస్తకానికి ప్రచారం కల్పించేందుకు భారత్కు వచ్చాడు.
కుంబ్లే వివరణ.. రాహుల్కే పంజాబ్ కెప్టెన్సీ ఎందుకిచ్చామంటే?!!
ఓ జాతీయ మీడియాతో పనేసర్ మాట్లాడుతూ... 'టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ విజయాల వెనక ఎక్కువ మంది ఆటగాళ్లు ఉన్నారు. అత్యుత్తమైన 15-20 మంది క్రికెటర్లు కోహ్లీకి అందుబాటులో ఉన్నారు. బాగా ఆడుతున్న ఆటగాళ్ల బృందం ఉందని అతడికి తెలుసు. ఆడుతున్నవారిని ఎంపిక చేసుకుంటున్నాడు. ఒకవేళ వారు విఫలమయితే మరొకరు. ఇదే టీమిండియా విజయాలకు కారణం' అని పేర్కొన్నాడు.
'ప్రస్తుతం భారత్కు అద్భుతమైన బౌలింగ్ దాడి ఉంది. ఫింగర్ స్పిన్నర్లు, మణికట్టు స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. పటిష్ట పేస్ ఉంది. న్యూజిలాండ్ను దాని సొంతగడ్డపై ఓడించే సామర్థ్యం టీమిండియాకు ఉంది. 80ల నాటి విండీస్, 90ల నాటి ఆస్ట్రేలియా స్థితికి చేరుకొనే అవకాశం కోహ్లీసేనకు ఉంది. విదేశాల్లో సత్తా చాటితే అది సాధ్యమే' అని పనేసర్ అన్నాడు.
ఐపీఎల్ ద్వారా నాణ్యమైన యువ క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. ఈ లీగ్ టీమిండియాకు ఎంతో మేలు చేస్తోంది. యువ ఆటగాడు జస్ప్రీత్ బుమ్రానే ఇందుకు నిదర్శనం. దీపక్ చహర్, నవదీప్ సైనీ లాంటి వారు వచ్చారు. బ్యాటింగ్ విషయానికి వస్తే.. సీనియర్లు, జూనియర్లతో కళకళలాడుతోంది. ఇక కోహ్లీ సారథ్యంలో ఆటగాళ్ల ఫిట్నెస్ స్థాయి బాగుంది' అని పనేసర్ చెప్పుకొచ్చాడు.