ముంబై టెస్టులో అవకాశం
తాజాగా ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన మాంటీ పనేసర్ నాటి విశేషాల్ని నెమరువేసుకున్నాడు. ఆ బంతిని సచిన్ టెండూల్కర్ సరిగ్గా అంచనా వేయలేకపోయాడని, దాంతో తన డెలివరీ వికెట్లను తాకుతూ బెల్స్ను ఎగరవేసిందని చెప్పాడు. 2012-13 పర్యటనలో తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓటమిపాలయ్యాక ముంబైలో రెండో టెస్టు జరిగింది. అప్పుడు పనేసర్కు ఇంగ్లండ్ తుది జట్టులో అవకాశం ఇచ్చారు. కెప్టెన్, యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఈ ఇంగ్లిష్ స్పిన్నర్ రెచ్చిపోయాడు. ఐదు వికెట్లు తీసి భారత బ్యాటింగ్ లైనప్ను దెబ్బతీశాడు.
సచిన్ అంచనా వేయలేకపోయాడు
'సచిన్ లాంటి బ్యాట్స్మన్ను ఔట్ చేయాలని ఏ బౌలర్కైనా ఉంటుంది. అందులో నేను కూడా ఉన్నా. ముంబై మ్యాచ్లో ఓ వైవిధ్యమైన బంతితో లిటిల్ మాస్టర్ను బోల్తాకొట్టించా. ఆ బంతిని సచిన్ సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. బంతి వికెట్లను తాకుతూ బెల్స్ను ఎగరవేసింది. లెగ్స్టంప్ ఆవల పడిన బంతి వికెట్లకు తాకుంతుందని పాజీ అంచనా వేయలేకపోయాడు. ఇంకా చెప్పాలంటే నేను వేసిన ఆ డెలివరీ 'షేన్వార్న్ శతాబ్దపు బంతి' కన్నా అత్యుత్తమైంది' అని మాంటీ పనేసర్ పేర్కొన్నాడు.
అది నిజమేనా అనిపిస్తుంది
సచిన్కు బౌలింగ్ చేస్తుండగా తనలో పూర్తి ఆత్మవిశ్వాసం నెలకొందని మాజీ స్ఫిన్నర్ మాంటీ చెప్పాడు. శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా ఉన్నట్లు అనిపించిందని తెలిపాడు. అందువల్లే ఓ వైవిధ్యమైన బౌలింగ్తో సచిన్ వికెట్ తీశానని వెల్లడించాడు.ఒక్కోసారి గుర్తుచేసుకుంటే అది నిజమేనా అనిపిస్తుందని తనకు సందేహం కలుగుతుందని మాంటీ తెలిపాడు. మాంటీ ఇంగ్లండ్ తరఫున 50 టెస్టులు, 26 వన్డేలు, 1 టీ20 మ్యాచ్లు ఆడాడు.
రెండో ఇన్నింగ్స్లోనూ 6 వికెట్లు
ముంబై టెస్టులో మ్యాచ్లో మాంటీ పనేసర్.. వీరేందర్ సెహ్వాగ్ (30), విరాట్ కోహ్లీ(19), ఎంఎస్ ధోనీ(29), రవిచంద్రన్ అశ్విన్ (68)లను ఔట్ చేశాడు. దాంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 327 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇంగ్లండ్ 413 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్లో భారత్ 142 పరుగులకే ఆలౌట్ అయింది. మాంటీ రెండో ఇన్నింగ్స్లోనూ 6 వికెట్లతో చెలరేగాడు. చివరికి ఇంగ్లండ్ పది వికెట్ల తేడాతో గెలిచి.. 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.
గాటింగ్ను బోల్తా కొట్టించిన వార్న్:
1993లో ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన యాషెస్ సిరీస్లో భాగంగా తొలి టెస్టులో షేన్ వార్న్ ఒక అద్భుతమైన బంతిని సంధించాడు. ఆ టెస్టు మ్యాచ్ జూన్ 3వ తేదీన ఆరంభం కాగా.. రెండో రోజు ఆట (జూన్ 4వ తేదీన)లో ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు మైక్ గాటింగ్ను వార్న్ బోల్తా కొట్టించాడు. ఆ బంతే వార్న్ కెరీర్ను మలుపు తిప్పింది. బంతిని నేరుగా గాటింగ్ కాళ్లకు ముందు అవుట్సైడ్ లెగ్స్టంప్పై వేసి ఆఫ్ వికెట్ను పడగొట్టిన తీరు ఇప్పటికీ చిరస్మరణీయమే. అసలు బంతి ఎక్కడ పడుతుందా అని గాటింగ్ అంచనా వేసేలోపే.. ఆఫ్ స్టంప్ను గిరాటేసింది. ఇక్కడ ఏం జరిగిందో తెలియక గాటింగ్ షాక్ అయ్యాడు. వార్న్ వేసిన ఆ బంతి ఇప్పటికీ 'బాల్ ఆఫ్ ది సెంచరీ'గానే పిలవబడుతోంది.