కోహ్లీ ప్రోత్సహం మరవలేనిది..
'కష్ట సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నన్ను రీటైన్ చేసుకుంది. కోహ్లీ భాయ్ నన్నెంతో ప్రోత్సహించాడు. ఒత్తిడి వీడి ఆటపై దృష్టి సారించాలని చెప్పాడు. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. ఐపీఎల్ ద్వారా మంచి అనుభవం లభించింది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్తో పోలిస్తే టెస్ట్ క్రికెట్ ఆడటం చాలా భిన్నమైంది. ఆసీస్ పర్యటనతో సంతోషంగా ఉన్నా. నాన్న కలను నెరవేర్చాలని పట్టుదలగా ఆడాను. టీమిండియాకు ఆడుతున్నా అనే విషయం మాత్రమే గుర్తుపెట్టుకున్నా.
అదే నా ఫేవరేట్ వికెట్..
ఒత్తిడికి లోనుకాకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. బుమ్రా నాకు పూర్తి మద్దతుగా నిలిచాడు. నాలుగో టెస్టులో తొలుత కాస్త ఆందోళనకు గురయ్యాను. కానీ అతను అండగా నిలిచాడు. నా ప్రదర్శనను ప్రశంసిస్తూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఇక అజ్జూ భాయ్(అజింక్య రహానే) యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచాడు. నటరాజన్, సైనీ, వాషింగ్టన్ సుందర్, నన్ను ఇలా అందరినీ ప్రోత్సహించాడు. కోహ్లీ భాయ్ కెప్టెన్సీని ఎంతగా ఎంజాయ్ చేశానో..రహానే సారథ్యాన్ని కూడా అంతే ఆస్వాదించాను. ఇక నా ఫేవరెట్ వికెట్ గురించి చెప్పాలంటే.. మార్నస్ లబుషేన్దే. కీలక సమయంలో తీసిన ఆ వికెట్ నాకెంతో ప్రత్యేకం.
ఇదే జోరు కొనసాగిస్తా..
'చాలా రోజుల తర్వాత ఇప్పుడే ఇంటికి వచ్చి ఇంటి భోజనం చేశా. అలా అని రిలాక్స్ అవ్వను. షమీ, ఉమేశ్ వచ్చిన తర్వాత కూడా మార్పు ఉండకపోవచ్చు. నిజానికి మేనేజ్మెంట్ ఎలా చెప్తే అదే నేను చేస్తాను. నేను ఇప్పుడు కూడా జూనియర్నే. అయితే ఆసీస్ విజయం ఇచ్చిన ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతాను. మనసు పెట్టి ఆడతాను అంతే. కఠినశ్రమతో పాటు ఆటను గౌరవించడం నేర్చుకున్నా. నా కుటుంబం, స్నేహితులతో పాటు అభిమానులు నాకు అండగా నిలిచారు. ఇక ముందు కూడా వారి నుంచి ఇలాంటి మద్దతే కావాలి'అని అభిమానులకు సిరాజ్ విజ్ఞప్తి చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సిరాజ్ మొత్తం 13 వికెట్లు తీశాడు. గబ్బా వేదికగా ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.