రికార్డుల్లోనే టీనేజర్లు.. కానీ ఒక్కొక్కడికి 27,28 ఏళ్లుంటాయి.. పాక్ మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు!

కరాచీ: పాకిస్థాన్ యువ పేసర్ల వయసుపై ఆ దేశ మాజీ క్రికెటర్ మహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జట్టుకు ఆడే బౌలర్లు పెద్ద వయసు వారేనని, అయితే వారు 9, 10 ఏళ్లు తక్కువగా పేర్కొంటారని ఆరోపించాడు. అందుకే సుదీర్ఘ స్పెల్స్ వేసేందుకు వారి శరీరం సహకరించడం లేదన్నాడు. న్యూజిలాండ్తో తొలి టెస్ట్లో ఓటమి నేపథ్యంలో ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

10 ఏళ్లు తక్కువగా..
‘వయో ధ్రువీకరణ పత్రాల్లో మా పేసర్లు 17, 18 ఏళ్ల వారిగా చూపిస్తారు. కానీ వాళ్ల నిజమైన వయసు 27, 28 ఏళ్లు. అందుకే ఈ వయసు పైబడిన బౌలర్లు సుదీర్ఘ స్పెల్స్ వేయలేరు. 20 నుంచి 25 ఓవర్లు వేసే సత్తా మా వాళ్లకు లేదు. ఇంకా చెప్పాలంటే ఐదారు ఓవర్ల స్పెల్ వేసిన బౌలర్కు మైదానంలో సరిగ్గా ఫీల్డింగ్ చేసే సామర్థ్యం కూడా ఉండదు. కనీసం తమ శరీరాన్ని ఎలా వంచాలో కూడా తెలియదు. కొంతసేపు బౌలింగ్ చేసిన తర్వాత కండరాలు పట్టేస్తున్నాయి'అని కమ్రాన్ అక్మల్కు చెందిన యూట్యూబ్ చానెల్లో ఆసిఫ్ ఆరోపించాడు. అయితే ఎవరి వయసు పైబడిందనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.

10 వికెట్లు తీయక..
ఇక ప్రస్తుత పాక్ పేసర్లకు సంపద్రాయక ఫార్మాట్లో 20 వికెట్లు తీసే సత్తా లేదని విమర్శించాడు. ఒకప్పటి అక్తర్, వకార్ యూనిస్, వసీం వంటి బౌలర్లు ప్రస్తుత జట్టులో లేరన్నాడు. పదుల సంఖ్యలో బౌలర్లు ఉన్నా.. నాణ్యమైన వారు మాత్రం లేడని పెదవి విరిచాడు. క్రీజులో బ్యాట్స్మెన్ కదలికలకు తగ్గట్లు ఎలా బౌలింగ్ చేయాలో కూడా తెలియడం లేదన్నాడు. ‘పాకిస్థాన్ పేసర్లు పది వికెట్లు పడగొట్టి దాదాపు ఐదారేళ్లు అవుతుంది. న్యూజిలాండ్ పిచ్లు చూస్తే అప్పట్లో మాకు నోరూరేది. కనీసం అయిదు వికెట్లు తీయకుండా బంతిని విడిచి పెట్టేవాళ్లం కాదు. కానీ ప్రస్తుత బౌలర్లకు బ్యాట్స్మెన్తో ఎలా తప్పులు చేయించాలో తెలియట్లేదు'' అని అసిఫ్ అన్నాడు.

కొత్తేమి కాదు..
అంతేకాకుండా డొమెస్టిక్ క్రికెట్ ఆడిన అనుభవం కూడా తక్కువనేనని విమర్శించాడు. అయితే వయసు తప్పుగా చూపిస్తూ కొందరు ఆటగాళ్లు అవకాశాలు సాధిస్తున్నారని ఆరోపణలు రావడం పాక్ క్రికెట్లో కొత్తేమి కాదు. గత కొన్నేళ్లుగా ఈ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కాగా, మ్యాచ్ ఫిక్సింగ్తో కెరీర్ను కోల్పోయిన ఆసిఫ్.. అవినీతిపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2010లో మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని అతనిపై ఐసీసీ ఐదేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

ఫస్ట్ టెస్ట్ ఓటమి..
న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్ట్లో పాకిస్థాన్ 101 పరుగుల భారీ తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఆతిథ్య కివీస్ 373 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించగా.. పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్లో 271 పరుగులకే పరిమితమైంది. ఫవాద్ అలామ్(102), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(60) పోరాడినా ఫలితం లేకపోయింది. మరో 28 బంతులు ఆడితే పాక్ ఓటమి తప్పించుకునేది. కానీ కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, కైల్ జేమీసన్, నీల్ వాగ్నర్, మిచెల్ సాంట్నర్ రెండేసి వికెట్లతో పాక్ పతనాన్ని శాసించారు. ఇక ఇరు జట్లు మధ్య రెండో టెస్ట్ నేడు(ఆదివారం) ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications