2015లో చివరి సారిగా..
చివరిసారిగా ఐపీఎల్ 2015 సీజన్లో ఆర్సీబీ తరఫున ఆడిన స్టార్క్.. 2018లో కేకేఆర్కు ఎంపికైనా గాయం కారణంగా ఆ సీజన్ ఆడలేదు. ఆ తర్వాత అతను ఆసక్తి కనబర్చలేదు. ఐపీఎలే కాదు.. ఆసీస్లో నిర్వహించే బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) లోనూ స్టార్క్ ఆడలేదు. అసలు ఫ్రాంచైజీ క్రికెట్కే అతను దూరంగా ఉన్నాడు. అయితే ఇదే విషయాన్ని అతని ముందు ప్రస్తావించగా.. అసలు కారణాన్ని వెల్లడించాడు. ఫ్రాంచైజీ లీగ్ కన్నా ఆస్ట్రేలియా తరఫున ఆడటమే తనకు ముఖ్యమని స్టార్క్ స్పష్టం చేశాడు. తన సతీమణితో గడిపే సమయం దొరకడం లేదని, ఇంక ఐపీఎల్ ఏం ఆడాలని ప్రశ్నించాడు.
ఆస్ట్రేలియా తరఫున ఆడటమే..
ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను బీబీఎల్లో ఆడేటప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాడిని. కానీ గడిచిన ఏడేండ్లలో ఫ్రాంచైజీ క్రికెట్ మీద నాకు ఆసక్తి తగడంతో పాటు అభిప్రాయం కూడా మారింది. ఐపీఎల్, బీబీఎల్ కంటే నాకు ఆస్ట్రేలియా తరఫున ఆడటమే ముఖ్యం. జాతీయ జట్టు తరఫున ఆడి మంచి ప్రదర్శనలివ్వడం, నా దేశం కోసం శక్తి మేర కృషి చేయడానికే నేను అత్యంత ప్రాధాన్యమిస్తాను.
నా సతీమణితో గడుపుతా...
అందుకే నేను ఈ లీగ్ క్రికెట్ ను పక్కనబెట్టాను. అదీగాక ఆసీస్ తరఫున మేం తీరిక లేని క్రికెట్ ఆడుతున్నాం. రాబోయే 18 నెలల్లో మాకు ఊపిరిసలపని షెడ్యూల్ ఉంది. నాకు ఖాళీ సమయం దొరికితే ఇంట్లో గడపడానికే మొదటి ప్రాధాన్యమిస్తా. నా భార్యను కూడా చూసుకోవాలి కదా...' అని స్టార్క్ వ్యాఖ్యానించాడు. స్టార్క్ భార్య అలిస్సా హీలి కూడా క్రికెటరనే విషయం తెలిసిందే. ఆసీస్ మహిళా క్రికెట్ జట్టులో వికెట్ కీపర్గా సేవలందిస్తున్న హీలి.. ఇటీవలే న్యూజిలాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో 175 పరుగులు చేసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది