మెల్బోర్న్: కుటుంబానికి దూరంగా ఉండటం ఇష్టం లేకనే ఐపీఎల్ 2022 సీజన్లో పాల్గొనడం లేదని ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అన్నాడు.
ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో పాల్గొనాలని ముందుగా నిర్ణయించుకున్న మిచెల్ స్టార్క్.. ఆఖరి నిమిషంలో మనసు మార్చుకున్నాడు. కుటుంబానికి దూరంగా 22 వారాల పాటు బయో బబుల్లో గడపడం తన వల్ల కాదని, అందుకే మెగా వేలంలో తన పేరు నమోదు చేసుకోలేదని వివరణ ఇచ్చాడు. తాజాగా ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన మిచెల్ స్టార్క్.. ఐపీఎల్ కంటే దేశమే తనకు ముఖ్యమని, ఫస్ట్ ప్రయారిటీ ఎప్పటికీ ఆస్ట్రేలియాకేనని స్పష్టం చేశాడు.
కాగా, స్టార్క్ 2015లో చివరిసారిగా ఐపీఎల్లో ఆడాడు. ఆ సీజన్, అంతకుముందు సీజన్లలో అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2018లో అతన్ని కోల్కతా నైట్ రైడర్స్ రూ. 9.4 కోట్లు పెట్టి దక్కించుకున్నప్పటికీ.. గాయం కారణంగా ఆ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
ఆ తర్వాత వివిధ కారణాల చేత అతను ఐపీఎల్కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్లో స్టార్క్(ఆర్సీబీ తరఫున) 27 మ్యాచ్ల్లో 34 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్లో స్టార్క్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. 5 టెస్ట్ల్లో 19 వికెట్లతో ఇంగ్లండ్ వెన్నువిరిచాడు. దీంతో ఈ ఆసీస్ పేసర్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని పలు ఐపీఎల్ జట్లు ప్రణాళికలు రచించాయి. కానీ అతను ఆసక్తి కనబర్చకపోవడంతో మిన్నకుండిపోయాయి.
ఐపీఎల్ 2022 మెగా వేలం బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగనుంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగియగా.. కొత్త జట్లు ముగ్గురేసి ఆటగాళ్లను కూడా ఎంచుకున్నాయి. ఇక ఐపీఎల్ మెగా వేలానికి మొత్తం 1012 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో ఆసీస్ నుంచి ఎక్కువ మంది ఉండటం గమనార్హం.