
పూణే: భారత్లో టెస్టు పిచ్లు బ్యాట్స్మెన్కు అనుకూలంగా ఉన్నాయి. ఉపఖండంలో పిచ్లు రసవత్తర పోటీలకు అనువుగా లేవు అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత మైకేల్ వాన్ అన్నారు. పూణేలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ చేసాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ రెండవ టెస్ట్ సెంచరీ సాధించాడు. మొదటి టెస్టులో రోహిత్ శర్మ రెండు సెంచరీలు చేసాడు. ఇక దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లలో కేవలం డీన్ ఎల్గర్ మాత్రమే సెంచరీ చేసాడు. పరుగుల వరద పారుతున్న భారత పిచ్లపై మైకేల్ వాన్ మండిపడ్డాడు.
భారత్, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్కు మైకేల్ వాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. భారత పిచ్లను దగ్గరినుండి చూస్తున్న వాన్.. ట్విట్టర్ వేదికగా పిచ్లను విమర్శించారు. 'భారత్లోని టెస్ట్ మ్యాచ్ క్రికెట్ పిచ్లు బోరింగ్గా ఉన్నాయి. మొదటి 3, 4 రోజులు పోటీ బ్యాట్స్మెన్కు అనుకూలంగా ఉంటోంది. బౌలర్కు పట్టు అవసరం. బౌలర్ల కోసం ఇంకా ప్రయత్నాలు జరగాలి' అని పేర్కొన్నారు.
ప్రస్తుతం మైకేల్ వాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. వాన్ వ్యాఖ్యలపై భారత అభిమానులు మండిపడుతుండగా.. ఇంగీష్ అభిమానులు మద్దతుగా నిలిచారు. చాలా మంది భారత అభిమానులు భారత పిచ్లను ఇంగ్లాండ్లోని పిచ్లతో పోల్చుతున్నారు. ఇంగ్లాండ్లో వర్షం, ప్రతికూల వాతావరణం కారణంగా అనేక టెస్ట్ మ్యాచ్లు సరిగా జరగలేదు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్ 2019తో పాటు యాషెస్ 2019 టెస్ట్ సిరీస్ను కూడా వర్షం తాకింది. ప్రపంచకప్లో వర్షంతో రద్దు అయిన పోటోలను జతచేసి.. వీటికన్నా మా పిచ్లు చాలా బెటర్ అని అంటున్నారు.
'ఇంగ్లాండ్లో టెస్ట్ మ్యాచ్లు 31% డ్రా కాగా.. భారత్లో 41% ఉంది. పెద్ద తేడా ఏముంది' అని ఓ భారత అభిమాని ప్రశనించాడు. 'ఇంగ్లాండ్ కంటే ఉత్తమ పిచ్లు', 'మీరు గెలవలేనప్పుడు నిందిస్తారు. భారతదేశంలో కుక్ ఆ 200+ స్కోరు చేసినప్పుడు మాత్రం ఏమీ అనరు. ఇంగ్లీష్ క్రికెట్ అంతా ఇంతే', 'ఉమేష్ యాదవ్ తన తొలి ఓవర్లోనే వికెట్ తీసుకున్నాడు. ఇది బౌలర్లకు సహకరించట్లేదా' అని అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.