|
ఆస్ట్రేలియాపై వాన్ ఫైర్:
దక్షిణాఫ్రికా పర్యటనను వాయిదా వేసినందుకు క్రికెట్ ఆస్ట్రేలియాను విమర్శిస్తూ మైకేల్ వాన్ ట్వీట్ చేశారు. 'దక్షిణాఫ్రికా పర్యటనకు ఆస్ట్రేలియా దూరం కావడం ఆటకు మంచిది కాదు. ఒకవేళ భారత పర్యటన ఉంటే.. ఆస్ట్రేలియా ఇలానే తప్పుకుంటుందా?. ఇది సరైన నిర్ణయం కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో బిగ్ 3 (భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) దేశాలు ఆర్థిక భారాన్ని చూడకండా.. క్రికెట్ మనుగడకు సాధ్యమైనంత మేర కృషి చేయాలి' అని వాన్ ట్వీట్ చేశారు. వాన్ ఇంగ్లండ్ తరఫున 82 టెస్టులు, 86 వన్డేలు, 2 టీ20లు ఆడారు.
భారీ మొత్తంలో ఖర్చు:
క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయంపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికిప్పుడు టూర్ను రద్దు చేసుకుంటే ఇప్పటికే కష్టాల్లో ఉన్న తాము మరింత ఆర్థికంగా దెబ్బతింటామని సీఎస్ఏ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసీస్ సిరీస్పై భారీ ఆశలు పెట్టుకున్న సీఎస్ఏ ఏర్పాట్ల కోసం ఇప్పటికే భారీ మొత్తంలో ఖర్చు చేసింది. షెడ్యూలు ప్రకారం వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో ఆసీస్ మూడు టెస్టులు ఆడాల్సివుంది.
తీవ్ర నిరాశకు గురి చేసింది:
సీఏ నిర్ణయం తమను నిరాశకు గురిచేసిందని సీఎస్ఏ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్, మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అన్నారు. 'సీఏ తీసుకున్న నిర్ణయం మమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. సీఏ కోరిన వసతులన్నీ కల్పించేందుకు కొన్ని వారాలుగా మేము వాళ్లతో కలిసి పనిచేస్తున్నాం. ఈ నెలాఖరులో ఆసీస్ జట్టు దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టాల్సి ఉంది. ఆ తర్వాత బయో బబుల్ వాతావరణంలో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడాలి. కానీ చివరి నిమిషంలో సీఏ తీసుకున్న నిర్ణయం మమ్మల్ని ఆవేదనకు గురి చేసింది' అని స్మిత్ పేర్కొన్నారు.
పోటీ నుంచి నిష్క్రమించిన ఆసీస్:
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో 71.7 శాతం పాయింట్లతో టీమిండియా నెం.1 స్థానంలో కొనసాగుతుండగా.. 70%తో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. ఇక మూడులో ఆస్ట్రేలియా (69.2%), నాలుగులో ఇంగ్లండ్ (68.7%) జట్లు ఉన్నాయి. నిజానికి ఫైనల్ రేసులో ఆస్ట్రేలియా కూడా ఉంది. కానీ దక్షిణాఫ్రికా టూర్ని రద్దు చేసుకోవడం ద్వారా ఆసీస్ పోటీ నుంచి నిష్క్రమించింది. దాంతో ఇప్పుడు ఫైనల్ రేసులో భారత్, ఇంగ్లండ్ మాత్రమే ఉన్నాయి.
కోహ్లీకి సహకరించడమే నా పని.. విరాట్ ఏమైనా సలహా అడిగితే చెప్తా: రహానే