కోహ్లీకి సహకరించడమే నా పని.. విరాట్ ఏమైనా సలహా అడిగితే చెప్తా: రహానే

చెన్నై: ఆస్ట్రేలియాతో సిరీస్ విజయం గతమని, ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో కెప్టెన్ విరాట్ కోహ్లీకి సహకరించడమే ఇక తన పని అని టీమిండియా వైస్ కెప్టెన్, సీనియర్ ఆటగాడు అజింక్య రహానే చెప్పాడు. ఐపీఎల్లో విదేశీ ఆటగాళ్లతో కలిసి ఆడతామని, కానీ తమ వ్యూహాలను వాళ్లతో పంచుకోమని జింక్స్ తెలిపాడు. కోహ్లీ గైర్హాజరీలో రహానే సారథ్యంలోని భారత జట్టు.. ఆస్ట్రేలియాపై చారిత్రక టెస్ట్ సిరీస్ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. టెస్టు సిరీస్ విజయంలో జింక్స్ స్ఫూర్తిమంతమైన సారథ్యం అందించాడు.

విరాట్కు సహకరించడమే నా పని:
భారత్-ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. తొలి రెండు టెస్టులకి చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే చెన్నైకి చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా మొదలెట్టారు. బుధవారం ప్రాక్టీస్ అనంతరం అజింక్య రహానే మాట్లాడుతూ... 'ఇప్పుడు విరాట్కు సహకరించడమే నా పని. ఇక నా బాధ్యత మరింత సులువు. కోహ్లీ ఏమైనా అడిగితే చెప్తా. టీమిండియాకు విరాట్ కెప్టెన్. కుటుంబ కారణాలతో స్వదేశానికి వచ్చాడు. దాంతో ఆస్ట్రేలియాలో నేను కెప్టెన్గా వ్యవహరించా. ఆస్ట్రేలియా సిరీస్ గతం. ఇప్పుడు వర్తమానంలో ఉన్నాం' అని అన్నాడు.

ఇంకా 3-4 నెలల సమయం ఉంది:
'శ్రీలంకలో టెస్టు సిరీస్ నెగ్గిన ఇంగ్లండ్ను మేం గౌరవిస్తాం. టీమిండియా టార్గెట్ ఇప్పుడు చెన్నైలో ఆడే తొలి టెస్టు మాత్రమే. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి ఇంకా 3-4 నెలల సమయం ఉంది. గత కొంతకాలంగా టెస్టుల్లో న్యూజిలాండ్ చాలా బాగా ఆడుతోంది. ఫైనల్కి చేరేందుకు ఆ జట్టుకి పూర్తి అర్హత ఉంది. ఇప్పుడు మేము ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ఆడబోతున్నాం. ఒక్కో మ్యాచ్ని టార్గెట్గా చేసుకుంటూ ఆడతాం. సిరీస్ ముగిసేలోపు ఏం జరుగుతుందో చూడాలి' అని అజింక్య రహానే చెప్పాడు.

విదేశీ ఆటగాళ్లకు పూర్తిగా చెప్పం:
'ఐపీఎల్ అందరం కలిసే ఆడతాం. కానీ టెస్టు క్రికెట్ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇంగ్లండ్ బౌలర్లు ఎలా బంతులేస్తారో మాకూ తెలుసు. ఐపీఎల్లో మా విషయాలన్నీ విదేశీ ఆటగాళ్లకు పూర్తిగా చెప్పం. లీగ్లో మేం కలిసే ఆడతాం.. కానీ దేశానికి ప్రాతినిథ్యం వహించేటపుడు మాత్రం వ్యక్తిగతంగా, జట్టుగా ఎలాంటి ప్రదర్శన చేశామన్నది ముఖ్యం. బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ మంచి ఆటగాళ్లు. ఇంగ్లండ్ తరఫున వాళ్లు బాగా ఆడుతున్నారు. ఆ జట్టు మంచి సమతూల్యంగా ఉంది' అని జింక్స్ పేర్కొన్నాడు.

ఫైనల్ బెర్తు ఇలా:
ఐసీసీ నూతనంగా ప్రవేశపెట్టిన టెస్టు ఛాంపియన్షిప్లో ఇప్పటికే న్యూజిలాండ్ ఫైనల్కి చేరగా.. మరో ఫైనలిస్ట్ బెర్తు కోసం భారత్, ఇంగ్లండ్ మధ్య పోటీ నెలకొంది. ఇంగ్లండ్తో నాలుగు టెస్టుల సిరీస్ని 2-1, 2-0, 3-1, 3-0, 4-0తో గెలిస్తే భారత్కి ఫైనల్ బెర్తు ఖరారుకానుంది. మరోవైపు ఇంగ్లండ్ కూడా ఈ సిరీస్లో 3-1, 3-0 లేదా 4-0తో భారత్ని ఓడిస్తే ఫైనల్కి వెళ్లనుంది. జూన్ 18 నుంచి 22 వరకూ లార్డ్స్ మైదానంలో ఫైనల్ జరగనుంది.
కరోనా కలకలం.. హెడ్ కోచ్తో పాటు స్టార్ బ్యాట్స్మన్కి పాజిటివ్!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications