లండన్: స్వింగ్ బౌలింగ్కు అనుకూలించే ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా గెలిచినప్పుడే టెస్టుల్లో అత్యుత్తమగా జట్టుగా నిలుస్తుందని మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అన్నాడు. అప్పుడు ఆ విషయంలో ఎలాంటి సందేహం ఉండదని అభిప్రాయపడ్డాడు. మొతేరా వేదికగా శనివారం ముగిసిన ఆఖరి టెస్ట్లో కోహ్లీసేన ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో నాలుగు టెస్ట్ల సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచి న్యూజిలాండ్తో టైటిల్ ఫైట్కు సిద్ధమైంది.
ఇక భారత్ విజయంపై స్పందించిన వాన్.. టెస్టుల్లో టీమ్ఇండియా చాలా బాగా మెరుగైందని కొనియాడాడు. మూడో టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడం పట్ల పిచ్పై విమర్శలు గుప్పించిన అతను ఇప్పుడు భారత జట్టు ప్రదర్శనను ప్రశసించాడు. 'గత మూడు టెస్టుల్లో భారత్.. ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించింది. ఇలానే ఇంగ్లండ్లోనూ గెలిస్తే అప్పుడు భారత్ ఈ శకంలో అత్యుత్తమ టెస్టు జట్టుగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా జరగాలంటే స్వింగ్ బంతులు ఆడటంలో భారత ఆటగాళ్లు కష్టపడాలి' అని వాన్ ట్వీట్ చేశాడు.
కాగా, జూన్లో ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో న్యూజిలాండ్తో తలపడనుంది. ఆపై ఆగస్టులో ఇంగ్లండ్లోనే ఆ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. దీంతో అక్కడ గెలవాలని వాన్ సవాల్ విసిరాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్లో 160 పరుగులు వెనుకబడిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లోనూ కుప్పకూలింది. కేవలం 54.5 ఓవర్లలోనే ఆ జట్టు 135 పరుగులకు ఆలౌటైంది. డాన్ లారెన్స్ (95 బంతుల్లో 50; 6 ఫోర్లు) మినహా అంతా విఫలయ్యారు. అశ్విన్ (5/47), అక్షర్ పటేల్ (5/48) పోటీ పడి ఐదేసి వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 365 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (174 బంతుల్లో 96 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ అవకాశం కోల్పోయాడు. అశ్విన్కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'.... పంత్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' పురస్కారాలు లభించాయి. ఇరు జట్ల మధ్య ఈ నెల 12 నుంచి అహ్మదాబాద్లోనే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుంది.