లండన్: కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో భారత్లో భయానక పరిస్థితులు నెలకొన్నా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ను కొనసాగించాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ వైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ఈ విపత్కర కాలంలో ఐపీఎల్ ద్వారా ప్రజలకు మంచి వినోదం లభిస్తుందని, అది వారికి కొంత ప్రశాంతతో పాటు భయాందోళనలు తగ్గిస్తుందన్నాడు. అయితే కరోనా భయంలో సౌతాఫ్రికాలో క్రికెట్ ఆడేందుకు ఇష్టపడని ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు తమ ఆటగాళ్లను ఐపీఎల్ కోసం భారత్కు ఎలా పంపించాయనే విషయం తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నాడు. ఎంత ఆలోచించినా సమాధానం దొరకడం లేదని ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
'నాకు తెలిసి ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఐపీఎల్ కొనసాగుతోంది. ఈ విపత్కర సమయంలో ఐపీఎల్ ద్వారా లభించే వినోదం ప్రజలకు ఎంతో అవసరం. కానీ కరోనా భయంలో సౌతాఫ్రికాలో క్రికెట్ ఆడటానికి ఇష్టపడని ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు.. తమ ఆటగాళ్లను ఐపీఎల్ 2021 సీజన్కు ఎలా అనుమతించాయి. ఈ విషయం గురించి ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు'అని వాన్ తన ట్వీట్లో పేర్కొన్నాడు.
ఈనెల 9వ తేదీన ప్రారంభమైన ఐపీఎల్ 2020 సీజన్.. మే 30న జరిగే ఫైనల్తో ముగియనున్న విషయం తెలిసిందే. అంటే ఇంకా సుమారు ఏడువారాలు పాటు ఈ టోర్నీ జరగనుంది. అయితే ప్రస్థుతం దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ కొనసాగించడం అవసరమా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కానీ చాలా మంది ఐపీఎల్ 2021 సీజన్ కొనసాగించాలని అభిప్రాయపడుతున్నారు. ఇక భారత్ను ప్రపంచ దేశాలు రెడ్ లిస్ట్లో పెట్టడంతో పాటు విమానాలను తాత్కలికంగా రద్దు చేయడంతో ఐపీఎల్లోని విదేశీ ఆటగాళ్లంతా భయాందోళనకు లోనవుతున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్, ఆండ్రూ టై స్వదేశానికి తిరుగు పయనమయ్యారు.
దాంతో దిద్దుబాటు చర్యలకు దిగిన బీసీసీఐ.. లీగ్ ముగిసిన అనంతరం విదేశీ క్రికెటర్లను వారి సొంత దేశాలకు పంపేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రతీ ఒక్క ఆటగాడు తమ ఇళ్లకు క్షేమంగా చేరిన తర్వాతే టోర్నీ ముగిసినట్లు భావిస్తామని పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫిసర్ హేమంగ్ అమిన్ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు మెయిల్ చేశాడు.