ఏకాగ్రతను చెదరగొట్టడానికి:
డొమెస్టిక్ క్రికెట్లో టాప్ ఫామ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్కు ఈసారి కూడా బీసీసీఐ సెలక్టర్లు మొండిచేయి చూపించారు. అతడిని ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికచేయలేదు. ఆ మరుసటి రోజే బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబైని ఒంటిచేత్తో గెలిపించిన సూర్యకుమార్.. సెలక్టర్లకు బ్యాట్తో సమాధానమిచ్చాడు. ముంబై 165 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగగా సూర్య (79 నాటౌట్; 43 బంతుల్లో 10x4, 3x6) కీలక ఇన్నింగ్స్ ఆడి ఆ జట్టును గెలిపించాడు. అతని జోరు చూసిన కోహ్లీ.. ఇన్నింగ్స్ మధ్యలో అతని ఏకాగ్రతను చెదరగొట్టడానికి ప్రయత్నించాడు. స్లెడ్జింగ్ చేయడానికి ప్రయత్నించగా.. సూర్య మాత్రం మారు మాట్లాడకుండా కోహ్లీని అలా కోపంగా చూస్తూ ఉండిపోయాడు.
కోహ్లీ మెచ్చుకున్నాడు:
ఆ గొడవకు సంబందించిన వీడియో, ఫొటోలు మరుసటి రోజు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. అయితే ఆ ఘటనను సూర్యకుమార్ యాదవ్ మాత్రం లైట్ తీసుకున్నాడు. విరాట్ కోహ్లీతో తనకు ఎలాంటి గొడవలు లేవని తాజాగా సూర్య తేల్చి చెప్పాడు. 'ఆ మ్యాచ్ జరిగేటప్పుడు బెంగళూరు సారథి కోహ్లీ ఒత్తిడిలో ఉన్నాడు. మ్యాచ్ గెలిచాక నా వద్దకు వచ్చి మంచి ఇన్నింగ్స్ ఆడావని ప్రశంసించాడు. నేను కూడా ఆ ఇన్నింగ్స్ను ఆస్వాదించా. మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరుగుతున్నపుడు ఇలాంటివి సహజమే' అని సూర్య చెప్పుకొచ్చాడు.
కోహ్లీతో కలిసి ఆడటాన్ని ఎంజాయ్ చేస్తా:
'విరాట్ కోహ్లీతో కలిసి ఆడటాన్ని నేను ఎంజాయ్ చేస్తా. కోహ్లీ ఎనర్జీ, దూకుడు నాకు ఎంతగానో నచ్చుతాయి. టీమిండియాకు ఎంపిక కాకపోవడంతో బెంగళూరు మ్యాచ్కు నేను మానసికంగా సిద్ధం కాలేదు. అయితే ముంబై మొదట ఫీల్డింగ్ చేయడంతో నాకు కాస్త సమయం దొరికింది. దాంతో మ్యాచ్ బాగా ఆడగలిగా. ఆస్ట్రేలియా పర్యటనకు నన్ను ఎంపిక చేయకపోవడంతో నిరాశచెందా. మూడు రోజులు ఎవరితో మాట్లాడలేకపోయా. కొద్ది రోజుల తర్వాత క్రికెట్ దిగ్గజం సచిన్ నుంచి ఓ సందేశం వచ్చింది. దాంతో నాలో నూతన ఉత్తేజం వచ్చింది' అని సూర్య తెలిపాడు. ఆట పట్ల అంకిత భావంతో ఉంటే, అదే నిన్ను పైకి తీసుకొస్తుందని సచిన్ చెప్పినట్లు గుర్తుచేసుకున్నాడు.
మా కోసమే ప్రత్యేక చెఫ్:
'లాక్డౌన్ సమయంలో మా ప్రాక్టీస్ కోసం ముంబై ఇండియన్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముంబై మొత్తం వర్షపు నీటితో నిండిపోయినా మేము రిలయన్స్ స్టేడియంలో సాధన కొనసాగించాం. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేందుకు పెద్ద పై కప్పు ఏర్పాటు చేసింది. అలాగే మూడు వేర్వేరు పిచ్లు సిద్ధం చేసింది. యూఏఈకి వెళ్లినా అక్కడా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. కఠిన పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన జాగ్రత్తలతో పాటు మంచి భోజనం, హాటల్ వసతి, అత్యుత్తమ సౌకర్యాలు కల్పించింది. మా కోసమే ప్రత్యేక చెఫ్ను నియమించారు. దాంతో ఏది కావాలంటే అది తిన్నాం. మ్యాచ్లు లేని సమయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పార్టీలు చేసుకున్నాం' అని సూర్య చెప్పాడు. ఈ సీజన్లో 16 మ్యాచుల్లో 480 పరుగులు చేసిన సూర్య.. టోర్నీ టాప్ స్కోరర్ల లిస్ట్లో నాలుగో స్థానంలో నిలిచాడు.
విరాట్ కోహ్లీ సంతానాన్ని.. ఆస్ట్రేలియన్ అని చెప్పుకోవచ్చు: మాజీ క్రికెటర్