ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ

అహ్మదాబాద్: ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వాటిని ఎక్కువగా వదిలేయడానికి ప్రయత్నించాలని వెటరన్ క్రికెటర్ మనోజ్ తివారీ సూచించాడు. ఈ విషయంలో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ నుంచి విరాట్ కొన్ని సూచనలు తీసుకోవాలన్నాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న ఆఖరి టెస్ట్లో విరాట్ డకౌట్గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. బెన్ స్టోక్స్ వేసిన ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని ఆడబోయిన విరాట్.. కీపర్ చేతికి చిక్కి నిరాశగా పెవిలియన్ చేరాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ సిరీస్లో విరాట్ తన మార్క్ పెర్ఫామెన్స్ కనబర్చలేదు. 6 ఇన్నింగ్స్ల్లో 11, 72, 0, 62, 27, 0 విఫలమయ్యాడు. హాఫ్ సెంచరీలను సెంచరీలుగా కూడా మల్చలేకపోయాడు. దాంతో విరాట్ బ్యాటింగ్పై అనిశ్చితి నెలకొంది.

టఫ్ కండిషన్స్..
అయితే భారత్-ఇంగ్లండ్ సిరీస్ చాలా టఫ్ పరిస్థితుల్లో జరుగుతుందని మనోజ్ తివారీ అన్నాడు. క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ఈ కఠిన పరిస్థితుల్లో భారీ స్కోర్లు చేయడం బ్యాట్స్మెన్కు అంత సులువు కాదని అభిప్రాయపడ్డాడు. 'చాలా కఠిన పరిస్థితుల మధ్య భారత్-ఇంగ్లండ్ సిరీస్ జరుగుతుందనే వాస్తవాన్ని మనం గ్రహించాలి. చెన్నై వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్ తొలి రెండు రోజులు మినహాయిస్తే బంతి టర్న్ అవుతూనే ఉంది. బ్యాటింగ్కు ప్రతికూలమైన పరిస్థితుల కారణంగానే స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో చిన్న స్కోర్లను పెద్దవిగా మలచడం అంత సులువు కాదు. ఈ చాలెంజింగ్ పరిస్థితుల్లో 50 పరుగులు చేసిన తర్వాత కూడా బ్యాట్స్మెన్ సెట్ కాడు.

ఆ బంతి ఆడాల్సింది కాదు..
ఈ రోజు మ్యాచ్లో విరాట్ ఆ బంతి ఆడాల్సింది కాదు. టాపార్డర్, మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేవారు సెటిల్ అయ్యేవరకు వీలైనంత వరకు బంతులు వదిలేయాలని బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. బంతులు వదిలేయడం కూడా ఓ నైపుణ్యం. ఈ రోజు రోహిత్ శర్మ చాలా కళాత్మకంగా బంతులు వదిలేశాడు. ఆఫ్ స్టంప్ విషయంలో మనకు నమ్మకం ఉన్నప్పుడు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులను వదిలేయవచ్చు. వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్మన్ అన్ని బంతులు సమర్థవంతంగా ఆడుతాడని అనుకుంటాం. కానీ స్టోక్స్ వేసిన ఆ బంతి బౌన్స్ అయింది. విరాట్ దాన్ని వదిలేయాల్సింది. ఔట్సైడ్ ఆఫ్ స్టంప్స్ బంతులను వదిలేసే విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ నేర్చుకోవాలి'అని తివారీ చెప్పుకొచ్చాడు.

చెత్త రికార్డు..
బెన్ స్టోక్స్ వేసిన 26వ ఓవర్ నాలుగో బంతిని విరాట్ కోహ్లీ ఫ్లిక్ చేయగా.. బంతి బ్యాట్ ఎడ్జ్కి తాకి కీపర్ బెన్ ఫోక్స్ చేతిలో పడింది. అనూహ్యంగా దూసుకొచ్చిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని ఆడలేక కోహ్లీ డకౌట్గా వెనుదిరిగాడు. ఈ డకౌట్తో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెత్త రికార్డును విరాట్ సమం చేశాడు. కోహ్లీకి కెప్టెన్గా టెస్టుల్లో ఇది 8వ డకౌట్. గతంలో ధోనీ కూడా కెప్టెన్గా 8సార్లు డకౌటయ్యాడు. ఇప్పుడు విరాట్ అతని రికార్డును సమం చేశాడు. ఈ సిరీస్లో భారత కెప్టెన్ డకౌట్ కావడం ఇది రెండోసారి.

పట్టు బిగించిన భారత్..
రిషభ్ పంత్(118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లతో 101) ధనాధన్ సెంచరీకి వాషింగ్టన్ సుందర్(117 బంతుల్లో 8 ఫోర్లతో 60 బ్యాటింగ్) సూపర్ ఫిప్టీ తోడవ్వడంతో ఇంగ్లండ్తో మొతేరా మైదానం వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్లో టీమిండియా పట్టుబిగించింది. ఓ దశలో 146 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును ఈ యువ ఆటగాళ్లు 113 పరుగుల భాగస్వామ్యంతో గట్టెక్కించారు. దాంతో శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 94 ఓవర్లలో 7 వికెట్లకు 294 పరుగులు చేసింది. క్రీజులో సుందర్తో పాటు అక్షర్ పటేల్(11 బ్యాటింగ్) ఉన్నాడు. ప్రస్తుతానికి భారత్ 89 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్(3/40) మూడు, బెన్ స్టోక్స్(2/73), జాక్ లీచ్ (2/66) రెండేసి వికెట్లు తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications