ముంబై: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) సెగ ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్కు కూడా తాకింది. ఇప్పటికే ఈ మహమ్మారి దేశంలో వేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ఈ క్యాష్ లీగ్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అనేక ఊహాగానాలు ప్రచారం జరుగుతున్నాయి. ఇవన్నీ గాలి వార్తలేనని నిర్వాహకులు, బీసీసీఐ ఎప్పటికప్పుడు చెబుతున్నా.. ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్టుగా.. వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో మహరాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె చేసిన వ్యాఖ్యలు అభిమానులను మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ప్రమాదకర కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లాంటి మెగా టోర్నీ నిర్వహిస్తే ఈ వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతుందని రాజేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. 'ప్రజలు ఎక్కువ సంఖ్యలో గమిగూడితే.. వైరస్ ప్రభావం దారుణంగా ఉంటుంది. ఇలాంటి టోర్నీలు తర్వాత కూడా నిర్వహించుకోవచ్చు' అని మంత్రి మీడియా సమావేశంలో అన్నారు. ఐపీఎల్ను వాయిదా వేయాలనే విషయంపై అధికార వర్గాల్లోనూ చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే నిర్ణయం తీసుకొని వెల్లడిస్తారని మంత్రి చెప్పారు.
ఇదిలా ఉండగా, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని, వైరస్ విజృంభిస్తున్నా.. బీసీసీఐ నివారణ చర్యలు తీసుకొని ముందుకెళ్తుందని స్పష్టంచేశారు. ఇప్పటికే కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా అనేక క్రీడా టోర్నీలు రద్దవుతున్నాయి. మరికొన్ని వాయిదా పడుతున్నాయి. ఈనెల 29న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్తో మెగా ఈవెంట్ ఆరంభంకానున్న విషయం తెలిసిందే.