మ్యాచ్ రద్దు కాకముందే క్రికెటర్లు వెళ్లిపోయారు:
అంపైర్లు మ్యాచ్ను రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించకముందే కొందరు ఆటగాళ్లు స్టేడియం నుంచి వెళ్లిపోయారని అసోం క్రికెట్ అసోషియేషన్ (ఏసీఏ) కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపాడు. 'చాలామంది ఆటగాళ్లు 9 గంటలకే స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అయితే అంపైర్లు రాత్రి 9.54కి మ్యాచ్ రద్దయినట్టు ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులు గొడవ చేయకుండా ఉండేందుకు అలా ప్రకటించి ఉండొచ్చని అనుకుంటున్నా' అని దేవజిత్ చెప్పాడు.
57 నిమిషాల సమయమే ఇచ్చారు:
'ఆదివారం దాదాపు 63 నిమిషాలు వర్షం కురిసింది. 8.45లోపు మైదానాన్ని సిద్ధం చేయకుంటే.. మ్యాచ్ను రద్దు చేయక తప్పదని మ్యాచ్ అధికారులు తేల్చారు. అయితే సిబ్బందికి అంపైర్లు 57 నిమిషాల సమయమే ఇచ్చారు. మరికొంత సమయం ఇచ్చి ఉంటే మైదానాన్ని సిద్ధం చేసేవాళ్లం. రివర్స్ ఓస్మోసిస్ కారణంగా పిచ్ చిత్తడిగా మారింది' అని దేవజిత్ తెలిపాడు.
మరో గంట సమయం ఇస్తే సిద్ధం చేసేవాళ్లం:
'జనవరి నాలాలో సాధారణంగా గువాహటిలో వర్షాలు ఎక్కువగా పడవు. వాతావరణం అనుకూలంగా ఉంటుంది అనుకున్నాం. కానీ.. ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం పడింది. టాస్ సమయానికి మైదానాన్ని సిద్ధం చేశాం. 6.50 నుంచి 7.50 వరకు వర్షం మరోసారి పడింది. అయితే 6.30 తర్వాత మైదానంపై మ్యాచ్ రెఫరీ, అంపైర్లకు పూర్తి అధికారం ఉంటుంది. దీంతో వారి ఆదేశాల మేరకు క్యూరేటర్ బృందం పనిచేసింది. మరో గంట సమయం ఇచ్చి ఉంటే మైదానాన్ని సిద్ధం చేసేవాళ్లం' అని దేవజిత్ చెప్పుకొచ్చాడు.
ఇండోర్లో రెండో మ్యాచ్:
తొలి టీ20లో టాస్ వేసాక.. మ్యాచ్ ప్రారంభం సమయానికి 15 నిమిషాల ముందు వర్షం పడింది. దాదాపు గంట తర్వాత ఆగిపోయింది. వర్షం తగ్గడంతో అంపైర్లు, మ్యాచ్ రెఫరీ పిచ్, మైదానాన్ని 7.45కు ఒకసారి, 9.30కు పరిశీలించారు. చివరకు 9.54కి మరోసారి పరిశీలించి మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఇండోర్లో ఇరు జట్ల మధ్య మంగళవారం రెండో మ్యాచ్ జరగనుంది.