సౌతాంప్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా కీలక వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ ముంగిట కెప్టెన్ విరాట్ కోహ్లీ(132 బంతుల్లో 44) ఎల్బీగా వెనుదిరిగాడు. ఓవర్నైట్ స్కోర్కు ఒక్క పరుగు కూడా చేయకుండానే కైల్ జెమీసన్ అద్భుత బంతికి కోహ్లీ పెవిలియన్ చేరాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని న్యూజిలాండ్ బౌలర్లు అందిపుచ్చుకుంటున్నారు. నిప్పులు చెరిగే బంతులతో వణికిస్తున్నారు. దాంతో పూర్తిగా డిఫెన్స్కు పరిమితమైన కోహ్లీ.. కొంతపాటు కంగారు పడ్డాడు.
ఓవైపు బౌల్ట్, మరోవైపు జెమీసన్ సూపర్ బౌలింగ్తో దాడికి దిగడంతో బంతిని బ్యాట్కు తగిలించడానికి ఇబ్బంది పడ్డారు. మూడో రోజు ఆటలో 8 బంతులే ఆడిన కోహ్లీ.. ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. జెమీసన్ వేసిన 68వ ఓవర్ నాలుగో బంతిని అంచనా వేయడంలో విఫలమైన కోహ్లీ వికెట్ల ముందు దొరికిపోయాడు.
146/3 ఓవర్నైట్ స్కోర్ మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ ఆదిలోనే బిగ్ వికెట్ కోల్పోయింది. క్రీజులోకి రిషభ్ పంత్ రాగా.. వైస్ కెప్టెన్ అజింక్యా రహానే(32) ఇన్నింగ్స్ను ముందుకు కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం 69 ఓవర్లలో భారత్ 4 వికెట్లకు 149 రన్స్ మాత్రమే చేసింది. రెండో రోజు ఆటలో చతేశ్వర్ పుజారా(8) విఫలమైనా.. రోహిత్ (34), గిల్ (28) ఆకట్టుకున్నారు.