
హైదరాబాద్: ఒకవైపు వెన్నునొప్పి బాధిస్తున్నా.. గెలవాలనే తపనతో చివరి వరకూ పోరాడాడు మహీ. ఒక్కో ఓవర్కు 20పరుగుల రన్రేట్ చేయాల్సిన నేపథ్యంలో అదే స్తైర్యంతో పోరాడాడు. ఇంతటి తీవ్రతరమైన పోటీని చూసి అభిమానులు సైతం అమితాసక్తితో ఎదురుచూశారు. వీక్షకులే కాదు.. సీనియర్ క్రికెటర్లు సైతం ఉత్కంఠతో ఎదురుచూశారు. దీంతో అతని ఫైటింగ్ ఇన్నింగ్స్ మరోసారి అభిమానులను ఆకట్టుకుంది.
కింగ్స్ పంజాబ్తో మ్యాచ్లో ధోనీ 44 బంతుల్లో 79 పరుగులు చేసినా.. చివరికి 4 పరుగులతో చెన్నైకి ఓటమి తప్పలేదు. ఐదు సిక్సర్లు, ఆరు ఫోర్లతో కింగ్స్ పంజాబ్ గుండెల్లో గుబులు పుట్టించాడు ధోనీ. ఈ ఇన్నింగ్స్ మొదటి నుంచీ ధోనీ బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడు. మధ్యమధ్యలో ట్రీట్మెంట్ తీసుకుంటూ అలాగే ఇన్నింగ్స్ కొనసాగించాడు. నొప్పి వేధిస్తున్నా తన మార్క్ షాట్లతో ధోనీ అలరించాడు.
చివరి ఓవర్లో 17 పరుగులు అవసరముండగా.. ఓ ఫోర్, సిక్స్ కొట్టినా టీమ్కు విజయం దక్కలేదు. ఈ పోరాటానికి ఫలితంగా ధోనీ ఇన్నింగ్స్పై ట్విట్టర్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. సెహ్వాగ్, రోహిత్శర్మ, మహ్మద్ కైఫ్, రషీద్ ఖాన్, హర్భజన్సింగ్లాంటి క్రికెటర్లు ధోనీని పొగడ్తల్లో ముంచెత్తారు. అయితే గేల్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్, పంజాబ్ బౌలర్ ముజీబ్ బౌలింగ్ మ్యాచ్ను మలుపు తిప్పాయని ధోనీ అన్నాడు.
ముఖ్యంగా మ్యాచ్ తర్వాత ధోనీ చేసిన కామెంట్స్ అభిమానులను మరింత ఆకట్టుకుంది. 'అవును. వెన్నునొప్పి నన్ను బాధించింది. ఫిజియో సాయంతో కాస్త ఉపశమనం పొందాను. మళ్లీ నొప్పి తిరగబెడుతుందా లేదా ఇప్పుడే చెప్పలేను. అయితే ఇవేవీ నాకు కొత్తేంకాదు. ఒక మోస్తరు గాయాలైనప్పుడు కూడా నొప్పిని భరిస్తూ ఆడగలను. దేవుడు నాకా శక్తి ఇచ్చాడు. పైగా తర్వాతి మ్యాచ్కు కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి బహుశా పూర్తిగా కోలుకోవచ్చని ఆశిస్తున్నా'' అని ధోనీ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.