ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం..
గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందడంతో చైనా వస్తువులు, మొబైల్ అప్లికేషన్స్ నిషేదించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో చైనా స్పానర్సర్షిప్లపై సమీక్ష కోసం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కావాలని కూడా నిర్ణయించుకుంది. అయితే ఈ విషయంలో కఠిన నిర్ణయమే తీసుకోవాలని ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ లెవన్ సహ యజమాని నెస్ వాడియా తేల్చి చెప్పాడు. మన దేశం కోసం, ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం కోసం ఐపీఎల్లో చైనా స్పాన్సర్లతో ఇకపై ఒప్పందాలు చేసుకోరాదన్నాడు.
ఇప్పుడు కష్టమైతే..
ఇప్పటికిప్పుడు ఒప్పందాన్ని ఉల్లంఘించడం కష్టం కాబట్టి 2021 నుంచి వాటిని పక్కన పెట్టాలని నెస్ వాడియా సూచించాడు. స్వదేశీ కంపెనీలు ఒక్కసారిగా ముందుకు రావడం కష్టమే అయినా... మెల్లమెల్లగా చైనా సంస్థలను పక్కన పెట్టాలని అతను చెప్పాడు. ‘ఐపీఎల్తో సంబంధం కలిగిన చైనా కంపెనీలను పక్కనబెట్టాల్సిందే. ఆర్థిక లాభాలకన్నా దేశ ప్రయోజనాలే ముఖ్యం. అయినా ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కానీ చైనీస్ ప్రీమియర్ లీగ్ కాదు. ఇతరులకు మనం ఓ ఉదాహరణగా నిలవాలి. ఎప్పుడైనా మన దేశమే ముందు. ఆ తర్వాత డబ్బు.
నేనే బీసీసీఐ బాస్ అయితే..
ఆరంభంలో మరో స్పాన్సర్ దొరకడం కష్టమవుతుందేమో. కానీ వారి స్థానంలో మెరుగైన భారత కంపెనీలు కచ్చితంగా లభిస్తాయి. దేశానికి, సైనికులకు మనం తగిన గౌరవం ఇవ్వాలి. అందుకే కేంద్రం చెప్పడానికి ముందే మనమే వాటిని నిషేధిస్తున్నట్టు ప్రకటించాలి. నేనే బీసీసీఐ అధ్యక్షుడినైతే ఈపాటికే వచ్చే సీజన్ కోసం భారత కంపెనీని స్పాన్సర్గా వెతకమని చెప్పేవాణ్ణి. వ్యక్తిగతంగా నేను చైనా వస్తువులను వాడేందుకు ఇష్టపడను. ఇలాంటి సమయంలో దేశం తరఫున నిలవడం మన నైతిక బాధ్యత' అని నెస్ వాడియా స్పష్టం చేశాడు.
చెన్నై నోట అదే మాట..
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కూడా చైనా కంపెనీల బాయ్కాట్కు మద్దతు పలికింది. మరో స్పాన్సర్ లభించడం కష్టమే అయినా, దేశం కోసం సరైన నిర్ణయం తీసుకోవాల్సిందేనని సీఎస్కే సీనియర్ అధికారి తెలిపాడు. మరో జట్టు అధికారి కూడా కేంద్రం తీసుకునే నిర్ణయాల ప్రకారం నడుచుకుంటామని పేర్కొన్నాడు.
ఇతర ఫ్రాంచైజీలు కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. అయితే ప్రభుత్వం నుంచి ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ఆలోచిస్తామని, అప్పటి వరకు ఇలాంటి విషయంలో వేచి చూడటమే సరైన పద్ధతి అని వారు అభిప్రాయపడ్డారు.