హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ అద్భుతంగా రాణిస్తుందని కుంబ్లే పేర్కొన్నాడు. ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అనుభవజ్ఞులు ఉన్నారని ఆయన గుర్తు చేశాడు. ఈ అనుభవంతో త్వరలో జరగబోయే టెస్టు సిరీస్లో ఆటగాళ్లు రాణిస్తారని టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తెలిపారు. తాజాగా చెన్నైలో కుంబ్లే మాట్లాడుతూ... 'ప్రస్తుత టీమిండియా జట్టు అన్ని విభాగాల్లో చాలా బలంగా ఉంది. ఎంతో అనుభవం గల బౌలర్లు ఉన్నారు. వీరంతా స్థిరంగా 20 వికెట్లు తీయగలుగుతున్నారు. బ్యాటింగ్ విభాగంలోనూ అంతే. అందరూ అనుభవజ్ఞులే' అని కుంబ్లే అన్నాడు.
'జట్టులో అందరూ ఆటగాళ్లకు సుమారు 50 టెస్టులు ఆడిన అనుభవం ఉంది. ప్రపంచంలోనే మేటి స్పిన్నర్లు మన వద్ద ఉన్నారు. అంతేకాదు, ఆటగాళ్లందరికీ ఇదే తొలి ఇంగ్లాండ్ పర్యటన కాదు. గతంలోనూ అక్కడ ఆడారు. దీంతో వారు ఇంగ్లాండ్ పరిస్థితులకు చాలా త్వరగా అలవాటు పడగలరు. ఇది మనకు కలిసొచ్చే అంశం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఈసారి ఇంగ్లాండ్లో టెస్టు సిరీస్ గెలిచే అవకాశాలు భారత్కు మెండుగా ఉన్నాయి' అని కుంబ్లే తెలిపాడు.
ఈ పర్యటనల్లో భారత స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. మే, జూన్ నెలలో అక్కడి వాతావరణం స్పిన్నర్లకు ప్రతికూలంగా ఉంటుంది. వర్షపాతం, మైదానంలో తేమ ఉండటంతో బంతి అనుకున్న రీతిలో స్పందించదని తెలిపాడు. కానీ, జూన్ ఆఖర్లో వెళుతుండగా స్పిన్నర్లకు రాణించే అవకాశం మెండుగా ఉందని వివరించాడు.
ఈ టెస్టు నిమిత్తం ఐపీఎల్ జరుగుతుండగానే జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కచ్చితంగా యోయో టెస్టు పాసైతేనే పర్యటనకు వీలవుతుందని నిర్ణయించింది. దీంతో ఆటగాళ్లంతా యోయో ఫిట్నెస్ టెస్టులో పాల్గొనగా అంబటి రాయుడు, మొహమ్మద్ షమీ, సంజూ శాంసన్లు ఉత్తీర్ణత సాధించలేకపోయారు. దీంతో పూర్తి ఫిట్నెస్తో ఉన్న జట్టుతో భారత్ పర్యటనకు బయల్దేరనుంది.