హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడటం వల్ల తన లయ కోల్పోకుండా ఉండేందుకు సాయపడుతుందని చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. అంతేకాదు ఈ సన్నాహాకం దక్షిణాఫ్రికాలో వికెట్లు తీసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపాడు.
ప్రస్తుతం కోహ్లీసేన దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడుతోన్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు సిరిస్ ముగిసిన తర్వాత ఇరు జట్ల మధ్య ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ కోసం జనవరి 24న కుల్దీప్ దక్షిణాఫ్రికాకు బయల్దేరనున్నాడు.
'ఇప్పటి వరకు బాగానే సాగింది. మొత్తం టీ20 (సయ్యద్ ముస్తాక్ అలీ) సీజన్ ఆడాను. మ్యాచ్ ప్రాక్టీస్ లభించింది. నా లయ కూడా బాగుంది. దక్షిణాఫ్రికాలో ఇదే ఫామ్ని కొనసాగిస్తానని ఆశిస్తున్నాను' అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.
ఇక, దేశవాళీ క్రికెట్ ఆడటంపై కుల్దీప్ మాట్లాడుతూ 'దేశవాళీ టీ20 టోర్నీలో వ్యక్తిగతంగా, జట్టు పరంగా ప్రతి మ్యాచ్ కీలకమే. రాష్ట్రం తరఫున ఆడటం ఎప్పుడూ గౌరవమే. నేను ఆడేందుకు రాష్ట్రమే అన్ని విధాలా సాయపడింది' అని కుల్దీప్ అన్నాడు.
టీ20ల్లో తానెప్పుడూ వికెట్లు తీసేందుకే ప్రాధాన్యత ఇస్తానని పరుగులు తక్కువగా ఇచ్చేందుకు చూడనని కుల్దీప్ పేర్కొన్నాడు. 'టీ20 అంటేనే వికెట్లు తీయడం. వికెట్లు తీయడం వల్లే జట్టు గెలుస్తుంది. మన జట్టు 230 పరుగులు చేస్తే ప్రత్యర్థి భారీ పరుగులు చేయడానికే చూస్తాడు. అలాంటప్పుడు వికెట్లు తీయడానికే చూస్తాను తప్ప పరుగులు నియంత్రించేందుకు ఆరాటపడను' అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.
విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టులో ఆడుతున్నప్పుడు ఫిట్నెస్ కూడా ఎంతో ముఖ్యమని తెలిపాడు. 'టీమిండియాకు ఆడుతున్నప్పుడు ఫిట్గా ఉండాలి. సుదీర్ఘ కాలం జట్టులో ఆడాలన్నా ఫిట్నెస్ ఎంతో కీలకం. గత రెండేళ్లుగా నా ఫిట్నెస్పై పూర్తిస్థాయిలో దృష్టి సారించా' అని కుల్దీప్ చెప్పాడు.
ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్కతా నైట్ రైడర్స్ తరుపున అవకాశం వస్తే ఆడతానని కుల్దీప్ చెప్పుకొచ్చాడు. 'కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఐదేళ్లు ఆడాను. అవకాశం వస్తే మళ్లీ ఆడతాను. అది ఒక కుటుంబంలా ఉంటుంది. ఈడెన్ నా సొంత మైదానం లాంటింది. ఆ పిచ్పై ఎక్కడ ఎలా బౌలింగ్ చేయాలో తెలుసు. ఇక్కడ ఆడితే నాపై ఒత్తిడి ఉన్నట్టే అనిపించదు' అని కుల్దీప్ అన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.