
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్ట్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసించాడు.
రెండో ఇన్నింగ్స్లో సిరాజ్ 5 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. తద్వారా అరుదైన ఘనతలను అందుకున్నాడు. అరంగేట్ర సిరీస్లోనే ఐదు వికెట్ల ఘనత సాధించిన బౌలర్గా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా గబ్బా వేదికగా ఒక ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్గా సిరాజ్ నిలిచాడు. ఈ నేపథ్యంలో సిరాజ్పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
'హైదరాబాద్ ప్లేయర్ సిరాజ్ చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. తన తండ్రి ఆశయం నెరవేర్చేందుకు పుట్టెడు దుఃఖంలోనూ బాధను దిగమింగుకొని రాణించడం గొప్ప విషయం. నీ ప్రదర్శనతో భారత్ సిరీస్ గెలవగలదనే నమ్మకం వచ్చింది. పైనున్న మీ తండ్రి నీ ప్రతిభను చూసి గర్వపడతారని, ఆశీర్వదిస్తారని' కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇక సిరాజ్, శార్దూల్ ధాటికి రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 294 పరుగులకే ఆలౌటైంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ 33 రన్స్ లీడ్ కలుపుకొని భారత్ ముందు 328 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. అయితే వర్షం కారణంగా నాలుగో రోజు 23.3 ఓవర్ల ఆట తుడిచిపెట్టుకుపోయింది. భారత్ గెలవాలంటే చివరి రోజు మొత్తం ఆడాలి. ఆడటమే కాకుండా ఎదురుదాడికి దిగుతూ భారీ ఇన్నింగ్స్లు ఆడితేనే విజయం దక్కుతుంది. లేకుంటే రోజంతా టైంపాస్ చేసి డ్రాతో గట్టెక్కాలి.