హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ మ్యాచ్లను హైదరాబాద్ వేదికగా నిర్వహించాలని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి విజ్ఞప్తి చేశారు. మ్యాచ్ల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లతో పాటు పూర్తి మద్ధతును ఇస్తామని తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో గతేడాది యూఏఈకి తరలిపోయిన ఈ క్యాష్ రిచ్ లీగ్.. ఈ సారి భారత్ వేదికగానే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వైరస్ ప్రభావం ఇంకా ఉన్న నేపథ్యంలో బీసీసీఐ కొన్ని వేదికల్లోనే ఐపీఎల్ నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. బోర్డు షార్ట్ లిస్ట్ చేసిన వేదికల్లో హైదరాబాద్కు చోటు దక్కలేదనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
Open appeal to @BCCI and @IPL office bearers to include Hyderabad as one of the venues for upcoming IPL season
— KTR (@KTRTRS) February 28, 2021
Our effective COVID containment measures are reflected in our low number of cases among all metro cities in India & we assure you of all support from the Govt
ఈ క్రమంలో ట్విటర్ వేదికగా స్పందించిన కేటీఆర్.. ఐపీఎల్ నిర్వహణ వేదికల్లో హైదరాబాద్ను కూడా చేర్చాలని బీసీసీఐతో పాటు ఐపీఎల్ ఆఫీస్ బేరర్లను కోరారు. తాము తీసుకుంటున్న కరోనా నిబంధనల ఫలితంగా దేశంలోని అన్ని మెట్రో సిటీల్లో కంటే తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నట్లు తెలిపారు. మ్యాచ్ల నిర్వహణకు ప్రభుత్వం తరఫున మద్దతు తప్పక ఉంటుందన్నారు.
ఐపీఎల్ 2021 సీజన్ కోసం బీసీసీఐ చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలను మాత్రమే వేదికలుగా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుంది.
ముంబైని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఆఖరి నిమిషంలో చేర్చారంట. ప్రేక్షకుల్లేకుండా మ్యాచ్లు నిర్వహించుకోవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇన్సైడ్ స్పోర్ట్స్ ఓ కథనంలో పేర్కొంది.
ముంబైలో మ్యాచ్లు వీలు కాని పక్షంలో హైదరాబాద్కు అవకాశం ఇవ్వాలని బోర్డు పెద్దలు భావించారు. కానీ ముంబైలో మ్యాచ్లకు అనుమతి లభించడంతో హైదరాబాద్లో ఐపీఎల్ క్రీడలపై నీలి నీడలు కమ్ముకున్నాను. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఐపీఎల్ నిర్వహించాలని కేటీఆర్ చేసిన ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ దీనికి అంగీకరిస్తుందో లేదో చూడాలి. ఇక భారత్-ఇంగ్లండ్ సిరీస్ల ముగిసిన వెంటనే ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.