రాజ్కోట్ రారాజు..
ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో రాహుల్ తన అద్భుత ప్రదర్శనతో రాజ్కోట్ రారాజుగా నిలిచాడు. బ్యాటింగ్, కీపింగ్లో మెరిసి మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిని గుర్తు చేశాడు. ముందుగా బ్యాటింగ్లో అనూహ్యంగా ఐదో స్థానంలో వచ్చి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 రన్స్ చేసి జట్టుకు భారీస్కోర్ అందించాడు. అనంతరం తన మార్క్ కీపింగ్తో ఔరా అనిపించే ఓ స్టంపౌట్, క్యాచ్తో ఆకట్టుకున్నాడు.
పంత్ కన్నా బెటర్..
గాయంతో రిషబ్ పంత్ దూరమవ్వడంతో కీపర్గా అదనపు బాధ్యతలు చేపట్టిన రాహుల్.. వికెట్ల వెనుకాల అతనికన్నా మెరుగ్గా రాణిస్తున్నాడు. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ను రెప్పపాటు సమయంలో స్టంపౌట్ చేసి ధోని మార్క్ కీపింగ్ను గుర్తుచేశాడు. జడేజా వేసిన 16వ ఓవర్ చివరి బంతిని తప్పుగా అంచనా వేసిన ఫించ్ క్రీజు దాటాడు. దీంతో బంతినందుకున్న రాహుల్ అంతే వేగంతో వికెట్లను కొట్టేసి ఫలితాన్ని రాబట్టాడు. ఇక చివర్లో సైనీ వేసిన 47వ ఓవర్ మూడో బంతి మిచెల్ స్టార్క్ బ్యాట్ను తగిలి బౌన్స్ అవ్వగా రాహుల్ అద్భుతంగా అందుకున్నాడు. ఈ రెండు వికెట్లు ఈ కర్ణాటక ప్లేయర్ కీపింగ్ టాలెంట్కు అద్దం పడుతున్నాయి.
జట్టు అవసరాలకు తగ్గట్టు
జట్టు అవసరాలు తగ్గట్లు ఆడటంలో రాహుల్ ద్రవిడ్ దిట్ట. ఆ తర్వాత ఆ స్థానాన్ని ధోని భర్తీ చేశాడు. గత కొంత కాలంగా ధోని క్రికెట్కు దూరంగా ఉండటం.. అతనికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న పంత్ విఫలమవ్వడంతో జట్టు ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పుడు రాహుల్ దిగ్గజాల తరహాలో రాణించడంపై అటు మాజీ క్రికెటర్లు.. ఇటు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శభాష్ రాహుల్..
జట్టు అవసరాలకు తగ్గట్లు రాణిస్తున్న రాహుల్పై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘జట్టు అవసరాల కోసం మల్టిపుల్ రోల్స్ పోషిస్తూ పరిస్థితులను అందిపుచ్చుకుంటున్న కేఎల్ రాహుల్ను మెచ్చుకోవాలి. ఒక రోజు ఓపెనర్గా, మరొక రోజు నాలుగో స్థానంలో.. ఇంకొక రోజు ఐదో స్థానంలో బరిలోకి దిగి రాణించడం అంత సులువు కాదు,'అని ట్వీట్ చేశాడు.