వెస్టిండీస్తో తొలి టెస్టు మ్యాచ్కు ఓపెనర్గా
ముంబై యువ క్రికెట్ వీరుడు పృథ్వీషా సంచలనం సృష్టించాడు. వెస్టిండీస్తో తొలి టెస్టు మ్యాచ్కు టీమిండియా ఓపెనర్గా ఎంపికయ్యాడు. స్ట్రోక్ ప్లేయర్ కేఎల్ రాహుల్తో కలిసి ఓపెనింగ్కు దిగాడు. దేశవాళీలో పరుగుల వరద పారించి సిరీస్కు ఎంపికైన మయాంక్ అగర్వాల్తో అతడికి తీవ్ర పోటీ ఎదురైంది. నెట్స్లో సాధనకు ముందు జట్టు యాజమాన్యం ప్రకటించిన తుది 12 మందిలో షా పేరు ఉండటంతో అతడి అరంగేట్రం జరిగింది.
భారత్ ఐదుగురు బౌలర్లతో బరిలోకి
భారత్ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగనుంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ విభాగం బాధ్యతలు చూసుకుంటారు. మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. యువ పేసర్ శార్దూల్ ఠాకూర్ 12వ ఆటగాడిగా ఉండే అవకాశాలున్నాయి. ఇంగ్లాండ్ సిరీస్లో చివరి మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన ఆంధ్రా ఆటగాడు హనుమ విహారి పేరు ప్రకటించలేదు.
రిషబ్ పంత్ ఆరో స్థానంలో బ్యాటింగ్
అదే మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. హార్దిక్ పాండ్య ఆల్రౌండ్ బాధ్యతలను రవీంద్ర జడేజా తీసుకోనున్నాడు. స్థానిక ఆటగాడు పుజారా, వైస్ కెప్టెన్ అజింక్య రహానె నెట్స్లో ఎక్కువ సమయం గడిపారు.
రంజీట్రోఫీ అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీ
పృథ్వీషా బ్యాటింగ్ ప్రతిభ అమోఘం. అండర్-19 సారథిగా అతడు ఈ ఏడాది న్యూజిలాండ్లో జరిగిన ప్రపంచకప్ను అందించాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో షాకు మంచి రికార్డు ఉంది. 14 మ్యాచుల్లో అతడు 56.72 సగటుతో ఏడు శతకాలు, ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు. రంజీట్రోఫీ అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీ బాదేశాడు. అత్యంత చిన్న వయసులోనే దులీప్ ట్రోఫీలో గణాంకాలు నమోదు చేశాడు.