పుణె: ఆండ్రీ రస్సెల్(28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 49 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్కు సామ్ బిల్లింగ్స్(29 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 34) బాధ్యతాయుత ఇన్నింగ్స్ తోడవడంతో సన్రైజర్స్ హైదరాబాద్ ముందు కోల్కతా నైట్రైడర్స్ 178 పరుగుల లక్ష్యాన్ని విధించింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. అజింక్యా రహానే(24 బంతుల్లో 3 సిక్స్లతో 28),నితీశ్ రాణా(16 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 26) ధాటిగా ఆడారు. సన్రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లతో చెలరేగగా.. భువీ, జాన్సెన్, నట్టూ తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్లోనూ కేకేఆర్కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(7)మరోసారి విఫలమయ్యాడు. జాన్సెన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన నితీశ్ రాణా, అజింక్యా రహానే వరుస సిక్స్లతో విరుచుకుపడటంతో కేకేఆర్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. అయితే ఈ ఇద్దరి జోరుకు ఉమ్రాన్ మాలిక్ కళ్లెం వేసాడు. తన ఫస్ట్ ఓవర్లోనే ఇద్దరిని పెవిలియన్కు చేర్చి కోలుకోలేని దెబ్బతీసాడు. తప మరుసటి ఓవర్లో శ్రేయస్ అయ్యర్(15)ను కూడా ఔట్ చేసాడు. ఆ వెంటనే రింకూ సింగ్ను నట్టూ ఎల్బీగా పెవిలియన్ చేర్చడంతో 94 పరుగులకే కేకేఆర్ ఐదు వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సామ్ బిల్లింగ్స్, ఆండ్రీ రస్సెల్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించిన ఈ జోడీ.. ఆరంభంలో నెమ్మదిగా ఆడినా ఆ తర్వాత వేగం పెంచారు. అయితే ఇన్నింగ్స్ 19వ ఓవర్లో సామ్ బిల్లింగ్స్ను భువీ ఔట్ చేశాడు. దాంతో 6వ వికెట్కు నమోదైన 63 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. సుందర్ వేసిన చివరి ఓవర్లో 3 సిక్సర్లు బాదిన రస్సెల్ 20 పరుగులు పిండుకొని భారీ స్కోర్ అందించాడు.