ఆక్లాండ్: వెస్టిండీస్ న్యూజిలాండ్ పర్యటనలో ఆతిథ్య జట్టు బోణీ చేసింది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన ఫస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ డక్వర్త్ లూయిస్ పద్దతిన 5 వికెట్లతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడిన వెస్టిండీస్ బ్యాటింగ్కు దిగగా.. 10 ఓవర్ల అనంతరం వర్షం అంతరాయం కలిగించింది. దాంతో మ్యాచ్ను 16 ఓవర్లకు కుదించారు. విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్( 37 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్లతో 75 నాటౌట్) విధ్వంసానికి తోడుగా ఫాబియన్ అలెన్(26 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్తో 30) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. కివిస్ బౌలర్లలో ఫెర్గూసన్ (5/21) విండీస్ పతనాన్ని శాసించాడు. సౌథీ 2 వికెట్లు తీశాడు.
అనంతరం డక్వర్త్ లూయిస్ పద్దతిన న్యూజిలాండ్ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 176గా నిర్ణయించారు. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 15.2 ఓవర్లలోనే 5 వికెట్లకు 179 పరుగులు చేసి 4 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. జిమ్మీ నీషమ్(24 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 48 నాటౌట్), మిచెల్ సాంట్నర్ (18 బంతుల్లో 3 సిక్సర్లతో 31 నాటౌట్) కడవరకు నిలిచి గెలిపించారు. డేవన్ కాన్వయ్(41) కూడా రాణించాడు. విండీస్ బౌలర్లలో థామస్ రెండు వికెట్లు తీయగా.. పొలార్డ్, కాట్రెల్ చెరొక వికెట్ పడగొట్టారు.
ఫెర్గూసన్ ధాటికి 59 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును కెప్టెన్ పొలార్డ్ సూపర్ ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. కానీ బౌలింగ్లో ప్రత్యర్థిని కట్టడి చేయకపోవడంతో ఓటమిపాలయ్యారు. ఈ మ్యాచ్లో ఓడినా పోలార్డ్ ఇన్నింగ్స్ మాత్రం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది.
India vs Australia: కోహ్లీ X రోహిత్ వైరం.. టీమిండియా కొంపముంచుతుందా?