ఐపీఎల్ ఆలస్యం కావడం వల్లే..
'ఈ పర్యటనలో ఇంతమంది గాయపడటం చాలా విచిత్రంగా ఉంది. వన్డే, టీ20 సిరీస్ల సందర్భంగా మా ఆటగాళ్లు గాయాల పాలయ్యారు. ఇప్పుడు టెస్ట్ సిరీస్లో టీమిండియా ఆటగాళ్లకు అదే పరిస్థితి ఎదురైంది. ఐపీఎల్ ఆలస్యంగా జరగడం వల్లే ఇలా జరిగిందనేది నా అభిప్రాయం. ఇలాంటి పెద్ద సిరీస్కు ముందు ఐపీఎల్ సరికాదు. ఐపీఎల్ అంటే నాకూ ఇష్టమే. ఇంగ్లిష్ కౌంటీ ఎలాగైతే ప్లేయర్స్కు ఉపయోగపడేదో.. ఇప్పుడు ఐపీఎల్ కూడా అంతే'అని లాంగర్ పేర్కొన్నాడు.
ఇరు జట్లలో గాయాలు..
ఈ సుదీర్ఘ పర్యటనలో వన్డే, టీ20 సిరీస్ సందర్భంగా డేవిడ్ వార్నర్, మార్కస్ స్టోయినిస్లు గాయపడగా.. టెస్ట్ సిరీస్లో మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హనుమ విహారిలు గాయాలపాలయ్యారు. ఇక మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగాల్సిన ఈ క్యాష్ రిచ్ లీగ్.. కరోనా కారణంగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 11 వరకూ యూఏఈలో జరిగిన విషయం తెలిసిందే.
స్మిత్ అమాయకుడు..
భారత ఆటగాడు రిషభ్ పంత్ గార్డ్ మార్క్ను చెరిపివేశాడని నిందలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్స్మిత్కు జస్టిన్ లాంగర్ మద్దతుగా నిలిచాడు. అతను అమాయకుడని వెనకేసుకొచ్చాడు. 'స్మిత్పై వచ్చిన కొన్ని చెత్త వార్తలను నమ్మలేకపోయా. అతని గురించి తెలిసివారు ఎవరైనా స్మిత్ చమత్కారమైన పనులు చేస్తాడని చెబుతారు.
గత కొన్నేళ్లుగా అతను చేసే పనులు చూసి మేం సరదాగా నవ్వుకున్నాం. గతంలో కూడా ఈ విషయాన్ని చెప్పాను. అయితే స్మిత్ ఎన్నోసార్లు క్రీజు వద్దకు వెళ్లి అలా చేశాడు. మ్యాచ్ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికే మాత్రమే అలా చేస్తాడు. అతడిపై నిందలు రావడం హాస్యాస్పదంగా ఉంది'అని లాంగర్ పేర్కొన్నాడు.