స్లో ఓవర్రేట్ కారణంగానే:
తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ... 'మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్లో మా బౌలర్లు గంటలో 15 ఓవర్లు వేయాల్సి ఉండగా.. రెండు ఓవర్లు తక్కువగా వేశారు. దాంతో మాపై స్లో ఓవర్ రేట్ నమోదైంది. ఐసీసీ నిబంధనల ప్రకారం మేము నాలుగు పాయింట్లు కోల్పోవాల్సి వచ్చింది. దాంతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అప్పటికీ ఈ విషయంపై మా జట్టు మేనేజర్ గెవిన్ డెవోయ్తో పాటు ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్తో చర్చించాను. స్లో ఓవర్ రేట్ వల్ల పాయింట్లు కోల్పోయే అవకాశం ఉందని.. అది ప్రపంచ టెస్టు చాంపియన్షిప్పై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నా' అని అన్నాడు .
బౌలర్లను కూడా హెచ్చరించా:
'స్లో ఓవర్ రేట్ విషయంలో అస్ట్రేలియా బౌలర్లను కూడా హెచ్చరించా. టెస్టు చాంపియన్షిప్పై ప్రభావం ఉంటుందని చెప్పా. సిడ్నీ, బ్రిస్బేన్ టెస్టుల్లో స్లో ఓవర్రేట్ కాకుండా చూసుకోవాలని తెలిపా. కానీ అనూహ్యంగా కరోనా కారణంగా దక్షిణాఫ్రికా టూర్ రద్దవడం మాకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఆ సిరీస్ రద్దు కావడం.. టీమిండియాతో జరిగిన సిరీస్ను మేం చేజార్చుకోవడంతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ అర్హతకు దూరం కావాల్సి వచ్చింది' అని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు.
40 శాతం జరిమానాతో పాటు నాలుగు ఫెనాల్టీ:
ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం అనుకున్న సమయానికి ఒక ఓవర్ తక్కువ వేస్తే.. మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానాతో పాటు రెండు ఫెనాల్టీ పాయింట్లు విధిస్తారు. ఆ లెక్కన ఆసీస్ రెండు ఓవర్లు తక్కువ వేయడంతో మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానాతో పాటు నాలుగు ఫెనాల్టీ పాయింట్లు దక్కించుకుంది. ఇక కరోనా కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనను ఆసీస్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా బోర్డు ఎంతచెప్పినా క్రికెట్ ఆస్ట్రేలియా వినలేదు. ఆటగాళ్ల ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యత అని చెప్పి ఆ పర్యటనకు వెళ్లలేదు. అదే ఆసీస్ కొంపముంచింది.
0.8 శాతం తేడా మాత్రమే:
ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం సాధించడం ద్వారా టెస్టుల్లో అగ్రస్థానంలో నిలవడంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. జూన్లో సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్ను భారత్ ఢీ కొట్టనుంది. అయితే డబ్ల్యూటీసీ పట్టికలో పీసీటీ పాయింట్ల పరంగా చూస్తే టీమిండియా 72 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ 70 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఇక ఆసీస్ 69.2 శాతంతో మూడో స్థానంలో కొనసాగుతోంది. పాయింట్ల పరంగా చూస్తే.. కివీస్కు, ఆసీస్కు 0.8 శాతం తేడా మాత్రమే ఉంది.