ధోనీ నా ఆరాధ్య క్రికెటర్:
తాజాగా జోస్ బట్లర్ మాట్లాడుతూ ఎంఎస్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. 'ఎంఎస్ ధోనీ నా ఆరాధ్య క్రికెటర్. అతని ఆటే చూడటమే క్రికెటర్లకి ఓ గొప్ప పాఠం. క్లిష్ట పరిస్థితుల్ని ఎలా అధిగమించాలి, సవాళ్ల ఎలా ఛేదించాలి అనేది ధోనీ నుంచి మనం నేర్చుకోవచ్చు. కీలక సమయంలో కూడా మహీ ఎంతో ధైర్యంతో ఉంటాడు. మ్యాచ్ ముగిస్తా అనే నమ్మకం అతనిలో కనిపిస్తుంది. కఠిన సమయాల్లో అతడు బ్యాట్ జులిపించే తీరు అద్భుతం. ఇప్పటికీ అభిమానులు ధోనీ నుంచి మెరుపులు ఆశిస్తుంటారు' అని అన్నాడు.
విదేశీ క్రికెటర్లకి ఒత్తిడి ఎక్కువ:
'ఐపీఎల్లో ఆడే విదేశీ క్రికెటర్లకి ఒత్తిడి శాతం కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లకి మాత్రమే ఆడే అవకాశం లభిస్తుంది. కాబట్టి తనతో పాటు జట్టులో చోటు కోసం పోటీపడే విదేశీ క్రికెటర్లు కూడా వరల్డ్ క్లాస్ ఆటగాళ్లే అయ్యుంటారు. అందుకే ప్రతి మ్యాచ్లోనూ మెరుగైన ప్రదర్శన కనబర్చాలనే ఒత్తిడి వారిలో ఉంటుంది' అని బట్లర్ వెల్లడించాడు.
ఐపీఎల్ నిరవధిక వాయిదా:
ఐపీఎల్లో ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి కెప్టెన్గా ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు కీపర్, ఓపెనర్గా జోస్ బట్లర్ కొనసాగుతున్నాడు. షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకావాల్సి ఉండగా.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా టోర్నీని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసేసింది. దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో.. ఈ ఏడాది టోర్నీ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ విషయంపై బీసీసీఐ త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
ప్రపంచకప్ జెర్సీకి రూ.60 లక్షలు:
మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జరుగుతున్న పోరాటంలో క్రీడాకారులు అందరూ తమవంతు సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జోస్ బట్లర్ కరోనా బాధితుల సహాయార్థం ముందుకొచ్చాడు. కరోనాపై చేస్తున్న పోరాటం కోసం తనకు ఎంతో ఇష్టమైన ప్రపంచకప్ 2019 జెర్సీని బట్లర్ వేలంలో విక్రయించాడు. ఆ జెర్సీకి రూ.60.83 లక్షలు వచ్చాయి. వేలంలో వచ్చిన మొత్తాన్ని లండన్లోని రాయల్ బ్రాంప్టన్, హ్యారీఫీల్డ్ ఆస్పత్రుల ఛారిటీ కోసం వినియోగిస్తానని బట్లర్ తెలిపాడు.