కరోనాపై డీఎస్పీగా..
వాస్తవానికి ఆ టీ20 ప్రపంచకప్ అనంతరమే హర్యానా ప్రభుత్వం జోగిందర్ సేవలను గుర్తించి రాష్ట్ర పోలీస్ శాఖలో డీఎస్పీ ఉద్యోగాన్ని ఇచ్చింది. 2018 వరకు క్రికెట్ కెరీర్ను లాక్కొచ్చిన జోగిందర్.. అదే ఏడాది అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇక రిటైర్మెంట్ అనంతరం డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నాడు.తాజాగా ఆ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి కోసం క్షేత్ర స్థాయిలోకి వెళ్లి జోగీందర్ సేవలు అందిస్తున్నాడు. తన టీమ్తో గస్తీ నిర్వహిస్తూ.. ప్రజలు బయటికి రాకుండా అవగాహన కల్పిస్తున్నాడు. దీంతో అతనిపై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది.
ప్రపంచకప్ అందించడం కంటే గొప్పది..
ఈ నేపథ్యంలో జోగిందర్ స్పందించాడు. పోలీస్ ఆఫీసర్గా ప్రజలకు సేవలందించడం.. ప్రపంచకప్ అందించిన దాని కంటే గొప్పదని అభిప్రాయపడ్డాడు.‘సమాజానికి నా వంతుగా ఇలా సేవడం చేయడం చాలా గొప్పగా అనిపిస్తోంది. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా ఇక్కడ ప్రజలు చనిపోతున్నారు. అందుకే వారిని కాపాడటం.. భారత్కు వరల్డ్కప్ అందించిన దాని కంటే గొప్ప ఘనత. ఇక్కడ నేను చేస్తున్న సేవ చాలా చిన్నది. కానీ.. భవిష్యత్ పరంగా చూస్తే.. ఇది చాలా పెద్దది'అని జోగీందర్ చెప్పుకొచ్చాడు.
కరోనాపై పోరుకు బీసీసీఐ భారీ విరాళం
సోషల్ మీడియాలో అవగాహన..
సోషల్ మీడియా వేదికగా కూడా వరుస పోస్ట్లతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంట్లోనే ఉండాలని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్తే సామాజిక దూరం పాటించి దేశం పట్ల మీకున్న భక్తి చాటుకోవాలని పిలుపునిచ్చాడు. శానిటైజర్స్ వాడటం కూడా అత్యంత కీలకమని విజ్ఞప్తి చేశాడు.
ఆఖరి ఓవర్లో అదరగొట్టిన జోగిందర్..
2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్కప్లో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసిన జోగిందర్ శర్మ.. తెలివైన బౌలింగ్తో భారత్ను గెలిపించాడు. జొహనెస్బర్గ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో పాకిస్థాన్ విజయానికి చివరి 6 బంతుల్లో 13 పరుగులు అవసరంకాగా.. తొలి బంతిని వైడ్గా వేసిన జోగిందర్ ఆ తర్వాత మిస్బావుల్ హక్కు సిక్స్ సమర్పించుకున్నాడు. కానీ.. అప్పటి కెప్టెన్ ధోనీ సూచనలతో ఒత్తిడిని జయించిన జోగిందర్ మూడో బంతికి మిస్బావుల్ హక్ను బోల్తా కొట్టించి యావత్ భారతాన్ని గెలుపు సంబరాల్లో ముంచెత్తాడు. భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1658కి చేరుకోగా.. 50 మంది వరకు మరణించారు. ఈ మహమ్మారిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం 21 రోజుల లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.