
న్యూఢిల్లీ: వరుసగా మ్యాచ్ ఆడే అవకాశం రాకపోవడం వల్లనే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆశించిన రీతిలో రాణించలేకపోయానని న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ జిమ్మీ నీషమ్ అన్నాడు. తన అంతర్జాతీయ గణంకాలను పోల్చుతూ ట్విటర్ వేదికగా ఓ భారత అభిమాని అడిగిన ప్రశ్నకు నీషమ్ సమాధానమిచ్చాడు. 2014 నుంచి ఐపీఎల్ ఆడుతున్న జిమ్మీ నీషమ్ ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. కానీ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
48 టీ20 మ్యాచుల్లో 25 వికెట్లు తీయడంతో పాటు 25.29 సగటుతో 607 పరుగులు చేశాడు. వన్డేల్లో 1400+ పరుగులు చేసిన జిమ్మీ నీషమ్, 69 వికెట్లు పడగొట్టాడు. 12 టెస్టుల్లో 2 సెంచరీలతో 709 పరుగులు చేసిన జిమ్మీ నీషమ్, 14 వికెట్లు తీసాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు కేవలం 12 మ్యాచ్లు మాత్రమే ఆడిన జిమ్మీ నీషమ్.. 61 పరుగులతో పాటు 5 వికెట్లు మాత్రమే తీయగలిగాడు.
తాజాగా ఓ భారత అభిమాని ట్విటర్ వేదికగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ జిమ్మీ నీషమ్ను ప్రశ్నించాడు. 'నువ్వు ఇంటర్నేషనల్ గేమ్స్లో ఆడినట్టుగా ఐపీఎల్లో ఎందుకు ఆడవు?'అని అడగిగాడు. 'ఏడాదికి ఒక మ్యాచ్ ఆడితే అంతర్జాతీయ క్రికెట్లో కూడా బాగా ఆడలేను.'అంటూ నవ్వుతున్న ఎమోజీని జోడించాడు. ఐపీఎల్లో తనకు అంతగా అవకాశాలు రాలేదనే విషయాన్ని సెటైరికల్గా చెప్పాడు.
ఆ తర్వాత ఆ ట్వీట్ను తప్పుగా అర్థం చేసుకుంటారని వివరణ ఇచ్చాడు. 'చాలామంది ఈ ట్వీట్ను ఎవరినో తిడుతున్నట్టు, లేదా ట్రోల్ చేస్తున్నట్టు అర్థం చేసుకుంటున్నారు. క్రికెట్ గురించి అవగాహన ఉన్నవారందరికీ వరుసగా మ్యాచులు ఆడుతున్నప్పుడే బాగా పర్ఫామెన్స్ ఇవ్వగలమనే విషయం తెలుసు. అయితే పరిస్థితులు అలా అనుకూలించకపోవచ్చు. ప్లేయర్లే వాటిని తమకు అనుకూలంగా మార్చుకోగలగాలి.. ఇందులో ఎవరి తప్పు లేదు.' అని జిమ్మీ నీషమ్ వివరణ ఇచ్చాడు.
ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నప్పుడు ఐపీఎల్ 2021లో 3 మ్యాచులు ఆడి 5 వికెట్లు తీసిన జిమ్మీ నీషమ్.. ట్రెంట్ బౌల్ట్, కీరన్ పోలార్డ్, క్వింటన్ డి కాక్లతో పోటీ కారణంగా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 2022లో రాజస్థాన్ రాయల్స్ టీమ్కు మారినా అదే పరిస్థితి ఎదురవ్వడంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఈ సారి కూడా ట్రెంట్ బౌల్ట్, జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మైర్, రస్సీ వాన్ డేర్ డుస్సేన్ వంటి ప్లేయర్ల కారణంగా తుది జట్టులో జిమ్మీ అవకాశం దక్కలేదు.