శార్దూల్.. పది బంతులు మాత్రమే
టెస్టుల్లో అరంగేట్రం చేసిన శార్దూల్.. పది బంతులు మాత్రమే వేయగలిగాడు. మ్యాచ్ నాలుగో ఓవర్లో నాలుగో బంతి విసిరి తొడ కండరాలు పట్టేయడంతో బాధతో కుప్పకూలాడు. మొదటి టెస్టు మ్యాచ్లోనే ఇలా జరగడంతో నిరుత్సాహానికి గురైయ్యాడు. ఆ సందర్భంలో కోహ్లీ చెప్పిన మాటలు తనకు ధైర్యానిచ్చాయని అంటున్నాడు.
నా మీద నాకే కోపం వచ్చి బాగా ఏడ్చా
అలా జరగడం వల్ల నా మీద నాకే కోపం వచ్చి బాగా ఏడ్చాను. ఆడుతున్న మొదటి అంతర్జాతీయ మ్యాచ్లోనే ఇలాంటి పరాభవాన్ని తట్టుకోలేకపోయాను. ఇది నిజంగా చాలా భయానక అనుభవం. ఫిట్నెస్ లోపమే ఇందుకు కారణం. నొప్పితో బాధపడుతున్న సమయంలో విరాట్ వెంటనే నా వద్దకు వచ్చి ఏం జరిగిందని అడిగాడు. నేను ఇక ఆడలేనని ఆయనతో చెప్పాను. దాదాపు కన్నీరు పెట్టుకున్నాను.
కోహ్లీ సూచనలు ఉపశమనాన్ని
ఆ సమయంలో కోహ్లీ చెప్పిన మాటలు నాకు ఉపశమనాన్ని కలిగించాయి. ఆయన వెంటనే ఫిజియోథెరపిస్ట్తో మాట్లాడాడు. మైదానం నుంచి వెళ్లి విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. మ్యాచ్ తరువాత ఆయన నా వద్దకు వచ్చి గాయం గురించి అడిగాడు. క్రీడాకారులకు ఇటువంటి ఘటనలు ఎదురవడం సాధారణమేనంటూ ధైర్యం చెప్పాడు. ఆ తరువాత కూడా ఆయన పలు సార్లు ఫోన్ చేసి పరిస్థితి గురించి ఆరా తీశాడు.
క్రీడాకారుడిగా సవాళ్లను ఎదుర్కోవాల్సి
ఓ క్రీడాకారుడిగా ఇటువంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, ఇటువంటి ఘటనలు చాలా బాధ కలిగిస్తాయి. ఆడుతున్న సమయంలో పూర్తి స్థాయిలో నైపుణ్యాలను ప్రదర్శించాలని అనుకుంటాను. అలాగే, ఎలాగైనా జట్టు గెలవాలని భావిస్తాను. బాగా ఆడడం వల్ల జట్టు గెలిస్తే అది నాకు చాలా సంతృప్తినిస్తుంది. నేను తదుపరి ప్రపంచకప్లో దేశం తరఫున ఆడాలని అనుకుంటున్నాను' అని శార్దూల్ వ్యాఖ్యానించాడు.