ఒక్క అవకాశం ఇచ్చి ఉంటే..
ధోనీ సారథ్యంలో సీఎస్కే తరఫున 20కి పైగా మ్యాచ్లు ఆడిన పాండే... మొత్తం 25 ఐపీఎల్ మ్యాచ్ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. 2015 తర్వాత ఐపీఎల్కు దూరమైన పాండే దేశవాళీ క్రికెట్ ఆడుతూ.. ఇటివల ఆటకు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసిన పాండే.. అందులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నా 24 ఏళ్ల వయసులో నేను మంచి ఫిట్నెస్తో ఉండటంతో పాటు సూపర్ ఫామ్లో ఉన్నాను. ఆ సమయంలో ధోనీ నాకు ఒక్క అవకాశం ఇచ్చిఉంటే టీమిండియాకు ఆడి, మంచి ప్రదర్శన చేసి ఈ రోజు ఒక మంచి స్థాయిలో ఉండే వాడిని.
వారితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం..
టీమిండియా తరఫున ఇంగ్లండ్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్లు ఆడేందుకు వెళ్లడం నాకెంతో గర్వకారణం. కానీ.. తుది జట్టులో స్థానం దక్కకపోవడం మాత్రం ఎంతో బాధకలిగించింది. అది నన్ను ఒక అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్గా మిగిల్చింది. కానీ.. విరాట్ కోహ్లీ, ధోని, యువరాజ్, సురేష్ రైనా, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్ లాంటి ఈ తరం గొప్ప క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం నాకెంతో ప్రత్యేకం.
నా కల నిజమైంది..
అలాగే దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్తో కలిసి ఆడటంతో నా కల నిజమైంది. సచిన్ను ఆటను చూస్తూ పెరిగాను. చిన్నతనం నుంచి అతన్నే ఆరాధించాను. అలాగే తనకు ఐపీఎల్ లాంటి ప్రపంచలోనే నంబర్ వన్ టీ20 లీగ్లో ఆడే అవకాశం కల్పించిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్కు ధన్యవాదాలు. ధోనీ సారథ్యంలో ఆడటం, 2014లో ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన జట్టులో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది. నా సుదీర్ఘ కెరీర్కు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, మధ్యప్రదేశ్ క్రికెట్ బోర్డుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నా కుటుంబం నాకు అందించిన సహకారానికి థ్యాంక్స్' అంటూ ఈశ్వర్ పాండే ఇన్స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగపూరిత పోస్ట్ షేర్ చేశాడు.