న్యూఢిల్లీ : కీలక కివీస్ టూర్ ముందు టీమిండియాకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే గాయంతో టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ న్యూజిలాండ్ టూర్కు దూరమవ్వగా.. తాజాగా ఇషాంత్ శర్మ కూడా తప్పుకున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా విదర్భతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ తరఫున ఆడుతున్నఇషాంత్.. సోమవారం బౌలింగ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే.
Senior India pacer Ishant Sharma ruled out of next month's two-Test series in New Zealand due to an ankle injury. #INDvsNZ#IshantSharma
— Press Trust of India (@PTI_News) January 21, 2020
విదర్భ సెకండ్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఇషాంత్ వేసిన షాట్ డెలివరీని ప్రత్యర్థి కెప్టెన్ ఫైజ్ ఫజల్ పుల్ చేయబోగా.. బ్యాట్ను మిస్సైన బంతి ప్యాడ్లను తాకింది. దీంతో గట్టిగా అప్పిల్ చేయబోయిన ఇషాంత్ కాలు జారి యాంకిల్లో పట్టేసింది. వెంటనే టీమ్ ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స చేసినా ఇషాంత్ నొప్పితో విలవిలలాడాడు. ఈ బాధతోనే మైదానం వీడాడు.
కివీస్ టూర్కు ముందు టీమిండియాకు భారీ షాక్.. గాయంతో స్టార్ ఓపెనర్ ఔట్!!
అయితే ఎమ్ఆర్ఐ స్కాన్లో లంబూ చీలమండలో చీలిక వచ్చిందని, అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్తాడని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది.
'లంబూ ఎమ్ఆర్ఐ స్కాన్ వచ్చింది. అదృష్టవశాత్తు ఫ్రాక్చర్ లేదు. కానీ చీలమండలో చిన్న చీలిక వచ్చింది. అతను ప్రస్తుతానికి నడవగలుగుతున్నాడు. ఎన్సీఏకు బయలుదేరనున్నాడు'అని డీడీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
అయితే లంబూ గాయం పెద్దదేనని, చీలమండలో గ్రేడ్-3 చీలిక వచ్చిందని తెలుస్తోంది. దీంతో అతనికి నెలపాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. 'బీసీసీఐ పర్యవేక్షణలో మరోసారి ఎమ్ఆర్ఐ స్కాన్ తీస్తాం. అతని చీలిక ఏ గ్రేడ్లో ఉందో నిర్ధారిస్తాం. అప్పుడు అతని రిహబిలిటేషన్పై నిర్ణయం తీసుకుంటామని'ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఇక ఇషాంత్ స్థానంలో యువ పేసర్ నవ్దీప్ సైనీకి అవకాశం దక్కనుంది.
జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో కోహ్లీసేన 5 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్ట్లు ఆడనుంది. ఇప్పటికే టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ..వన్డే, టెస్ట్ టీమ్స్ను ఎంపికచేయాల్సి ఉంది. కానీ స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కోసం జట్ల ఎంపికను సెలెక్షన్ కమిటీ వాయిదా వేసుకుంటూ వస్తోంది. గత కొంతకాలంగా టెస్ట్ల్లో నిలకడగా రాణిస్తున్నఇషాంత్ గాయపడటం టీమ్మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. ఫిబ్రవరి 21న వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభంకానుంది.